పార్లమెంట్ సమావేశాలు: నిరుద్యోగం, ధరల పెరుగుదల సహా ప్రజా వ్యతిరేక విధానాలను లేవనెత్తనున్న కాంగ్రెస్
New Delhi: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 7న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగుతాయి. పార్లమెంట్ లో చర్చలకు ప్రతిపక్ష, అధికార పార్టీలు ఇప్పటికే పలు అంశాలను సిద్దం చేసుకున్నాయని సమాచారం.
Parliament Winter Sessions: నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తదితర అంశాలను బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తడానికి కాంగ్రెస్ నిర్ణయించింది. దానికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వెల్లడించారు. “కుల గణనకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంది, దానిని పూర్తి చేయడం అవసరం. EWS రిజర్వేషన్పై చర్చలు జరిగాయి, ఎందుకంటే ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సవరణపై అంగీకరించారు. ఇద్దరు దానిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిని పునఃపరిశీలించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. పార్లమెంటులో చర్చను కోరుతుంది” అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ అన్నారు.
పార్లమెంట్ సమావేశాల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. “నేటి సమావేశంలో, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర (MSP) హామీ, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, సైబర్ నేరాలు, న్యాయవ్యవస్థ, కేంద్రం-రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత, రూపాయి బలహీనపడటం, ఉత్తర భారతదేశంలో ఎగుమతులు, వాయు కాలుష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఆయా అంశాలతో పాటు ఇతర వాటిపై కూడా చర్చించారు' అని జైరామ్ రమేష్ తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 7న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగుతాయి. పార్లమెంట్ లో చర్చలకు ప్రతిపక్ష, అధికార పార్టీలు ఇప్పటికే పలు అంశాలను సిద్దం చేసుకున్నాయని సమాచారం.
ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం.. దేశవ్యాప్త కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర క్రమంలోనే రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనకపోవచ్చునని సమాచారం. కాగా, శీతాకాల సమావేశాలు ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయి. కొత్త భవనం సిద్ధం కాకపోవడంతో పాత భవనంలోనే సమావేశాలు జరుగుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా సభ కూడా ఒక నెల ఆలస్యం కావాల్సి వచ్చిది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం సహా 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లును కూడా రాబోయే సెషన్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నేషనల్ డెంటల్ కమిషన్ ను ఏర్పాటు చేసి, దంతవైద్యుల చట్టం-1948ని రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. దీనితో పాటు, నేషనల్ నర్సింగ్ కమిషన్కు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో నేషనల్ నర్సింగ్ కమిషన్ (ఎన్ఎన్ఎంసీ)ని ఏర్పాటు చేయాలనీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చట్టం-1947ను రద్దు చేయాలని ప్రతిపాదించారు. గురువారం విడుదల చేసిన లోక్సభ బులెటిన్ ప్రకారం.. సహకార సంఘాలలో పాలనను బలోపేతం చేయడం, పారదర్శకత, జవాబుదారీతనం, ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడం వంటి లక్ష్యంతో బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు-2022 ప్రవేశపెట్టనున్నారు.