పౌరసత్వ సవరణ బిల్లు: ఓటింగ్, విపక్షాలపై అమిత్ షా ఫైర్
పౌరసత్వ బిల్లుపై పార్లమెంట్లో గందరగోళం చోటు చేసుకొంది. ఓటింగ్ తర్వాతే ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై సోమవారం నాడు పార్లమెంట్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు ఓటింగ్ను కోరాయి. ఓటింగ్లో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓట్లు రావడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాడు.
సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
పౌరసత్వ సవరణ బిల్లు సమానత్వ హక్కుకు విరుద్దమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ టీఎంసీ సభ్యులు సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది.
పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో విపక్షాలు వాకౌట్ చేయకూడదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కోరారు. అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లా, పాక్ శరణార్ధుల విషయంలో కాంగ్రెస్ వివక్ష చూపిందని అమిత్ షా ఆరోపించారు. ఈ బిల్లుతో ఇండియా ఇజ్రాయిల్ మాదిరిగా మారే అవకాశం ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు ఓటింగ్కు పట్టుబట్టాయి. ఈ బిల్లుపై విపక్షాల డిమాండ్ మేరకు ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ తర్వాత బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.