పార్లమెంట్లో గందరగోళం.. హిడెన్బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు.. ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా..
పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమైన కాసేపటికి విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమైన కాసేపటికి విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అదానీ ఎంటర్ప్రైజెస్కు వ్యతిరేకంగా హిడెన్బర్గ్ నివేదికపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. విపక్ష ఎంపీల నిరసనలతో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే లోక్సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాజ్యసభలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొనడంతో.. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎన్సీ, జేడీయూ, సీపీఎం, డీఎంకే, సీపీఐ నాయకులతో పాటు తృణమూల్, ఆప్, ఎస్పీలకు చెందిన ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ముందు పలు విపక్ష పార్టీలు ఉభయ సభలలో హిడెన్బర్గ్ నివేదికపై వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.