కేంద్రం నిర్ణయం.. మహిళల వివాహ వయసు పెంపు?
ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం మహిళల పెళ్లి వయస్సుపై సంచలన నిర్ణయం తీసుకోనుంది. బడ్జెట్ సమయంలో చేసిన ప్రకటన మేరకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళల కనీస వయసు పెంచుతామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి కావడం వల్లే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావిస్తోంది. అందుకే వారు ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారన్న దానిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దేశంలో అనేక రాష్ట్రాలు మాతృ మరణాలపై పురోగతి సాధించినా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు.
ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్య రేట్, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలను సమగ్ర పరిశీలన చేసి జూలై 31 నాటికి టాస్క్ఫోర్స్ కేంద్రానికి నివేదిక అందజేయనుంది