రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ విచారణ:మణిపూర్ అల్లర్లపై అమిత్ షా
మణిపూర్ లో చోటు చేసుకున్న అల్లర్లపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ విచారణ చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.
న్యూఢిల్లీ: మణిపూర్ లో చెలరేగిన హింసపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ విచారణ నిర్వహించనుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా మణిపూర్ లో నాలుగు రోజుల పాటు పర్యటించారు. మణిపూర్ లో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు పలువురితో సమావేశాలు నిర్వహించారు. గురువారంనాడు అమిత్ షా ఇంఫాల్ లో మీడియాతో మాట్లాడారు. మరో వైపు మణిపూర్ లో జరిగిన హింసపై సీబీఐ విచారించనుందన్నారు. ఈ హింస వెనుక కారణాలను బయటకు తీసుకువస్తామన్నారు. విచారణ పారదర్శకంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
భద్రతా సిబ్బంది నుండి ఆయుధాలను దోచుకున్న వారు తిరిగి అప్పగించాలని కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు. లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత నెలలో మణిపూర్ లో కొన్ని హింసాత్మక ఘటనలు నమోదయ్యాయన్నారు. ఈ ఘటనల్లో మరణించిన కుటుంబాలకు అమిత్ షా సంతాపం తెలిపారు. రాష్ట్రంలోని ఇంఫాల్ , మోరేతో సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.మృతుల కుటుంబాలకు మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహరం అందిస్తుందని అమిత్ షా చెప్పారు.