Pakistani boats: భారత జలాల్లోకి పాకిస్థాన్ బోట్లు.. సీజ్ చేసిన బీఎస్ఎఫ్ అధికారులు
Pakistani boats : భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన రెండు పాకిస్తానీ పడవలను BSF స్వాధీనం చేసుకుంది. గుజరాత్ లోని ఇండో-పాక్ సముద్ర సరిహద్దు సమీపంలోని హరామీ నాలా క్రీక్ ప్రాంతంలో పాక్ జాలర్లు భారత భూభాగంలోకి ప్రవేశించే సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి.
Pakistani boats : భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన రెండు పాకిస్థాన్ బోట్లను సరిహద్దు భద్రతా దళం(BSF) సీజ్ చేసింది. గుజరాత్లోని కచ్ జిల్లా హరమినాలా ప్రాంతంలో గురువారం ఉదయం బీఎస్ఎఫ్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాక్ బోట్లను గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. ఆ బోట్లను సీజ్ చేశారు. ఈ బోట్లు భారత జలాల్లోకి ఎందుకు ప్రవేశించాయనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. చొరబాటుదారుల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.
BSF గుజరాత్ ఫ్రాంటియర్ పీఆర్వో తెలిపిన వివరాల ప్రకారం.. బోట్లలో ఉన్న మత్స్యకారులు BSF పెట్రోలింగ్ బృందాన్ని చూసి పాకిస్థాన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారనీ, అయితే.. భద్రత బలగాలు వారిని వెంబడించి.. బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరికొందరూ నిందితులు పారిపోయినట్టు తెలిపారు. సీజ్ చేసిన బోట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారనీ. ప్రస్తుతం ఈ పడవల్లో ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు లభించలేదని తెలిపారు.
గతనెల మొదటి వారంలో (జూలై 7న) గుజరాత్లోని ఇండో-పాకిస్తాన్ సముద్ర సరిహద్దులోని కచ్ జిల్లా హరామీ నాలా క్రీక్ ప్రాంతంలో BSF అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. నలుగురు పాకిస్తాన్ మత్స్యకారులను పట్టుకున్నారు. వీరితో పాటు 10 బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు అయితే బోట్లలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. భారత భూభాగంలోని సరిహద్దు కాలమ్ నంబర్ 1165- 1166 మధ్య మత్స్యకారులు ప్రవేశించినట్టు తెలిపారు.
జూన్లో కూడా ఇదే ప్రాంతంలో ఇద్దరు పాకిస్థానీ మత్స్యకారులు పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్లోని కచ్ జిల్లా సమీపంలోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని హరామి నాలా క్రీక్ ప్రాంతంలో జూన్ 23 రాత్రి ఇద్దరు పాకిస్తానీ మత్స్యకారులను BSF అరెస్టు చేసింది. కొద్ది సేపటి తర్వాత.. పాక్ చెందిన మరో ఇద్దరు జాల్లర్లను పట్టుకున్నట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. అయితే, పాకిస్థాన్ వైపు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిపై కాల్పులు జరిపినట్టు తెలిపారు. పలు మీడియా నివేదికల ప్రకారం.. మే నుంచి జూలై మధ్య కాలంలో BSF పెట్రోలింగ్ లోసుమారు 28 పాకిస్తానీ పడవలు, 10 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు.