జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాన్ ఆర్మీ బరితెగించినట్లు వ్యవహరిస్తోంది. విరామం లేకుండా ప్రతిరోజు రాత్రి కాల్పులు జరుపుతోంది. అయితే పాక్ కు భారత సైన్యం దీటుగా బదులిస్తోంది. 

India Pakistan Tension: ఏప్రిల్ 30 రాత్రి నుంచి మే 1, 2025 ఉదయం వరకు పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద చిన్న తుపాకులతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచూ ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉండే కుప్వారా, ఉరీ, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. భారత సైన్యం పాకిస్తాన్ కాల్పులకు తగిన విధంగా బదులిచ్చింది. పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని, శత్రు చర్యలను అడ్డుకుందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ 29, 30 రాత్రి కూడా జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా, సుందర్‌బని, అఖ్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు దిగింది. ఇలా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ చెక్‌పోస్టులు నియంత్రణ రేఖను దాటి కాల్పులు ప్రారంభించాయని భారత సైన్యం తెలిపింది. భారత్ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించడంతో పాకిస్తాన్ ఆగ్రహంతో నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరుపుతోంది.

ఇప్పటికే ఈ కాల్పుల వ్యవహారంపై పాక్‌ డీజీఎంవోతో చర్చించారు భారత డీజీఎంవో... అయినాకూడా పాక్ సైన్యం తీరు మారడంలేదు. దీంతో ఈ కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాగే రెచ్చగొడితే పాక్ కు గట్టిగా సమాధానం చెబుతామని... అప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇండియన్ ఆర్మీ హెచ్చరిస్తోంది. 

Scroll to load tweet…

 

 ఇదిలావుంటే ఇటీవల భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలపై కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ భారత నౌకాదళానికి మెరైన్ తరగతికి చెందిన 26 రాఫెల్ యుద్ధ విమానాలను అందిస్తుంది. వీటిలో 22 సింగిల్ సీటర్ యుద్ధ విమానాలు ఉండగా, 4 ట్విన్ సీటర్ విమానాలను శిక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ జెట్‌లు భారత నౌకాదళ బలాన్ని మరింత పటిష్టం చేస్తాయి.