కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాది అరెస్టు.. మరో టెర్రరిస్టు హతం.. బార్డర్ నుంచి చొరబాటు
జమ్ము కశ్మీర్లోకి మళ్లీ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబాటు యత్నాలు పెరుగుతున్నాయి. ఈ నెలలో చొరబాటు యత్నాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా, ఉరి సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ పాకిస్తాన్ ఉగ్రవాది హతమైనట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపాయి.
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రచిచ్చు రేపడానికి పాకిస్తాన్ శతవిధాల ప్రయత్నిస్తున్నది. సరిహద్దు గుండా జమ్ము కశ్మీర్లోకి టెర్రరిస్టులు అక్రమంగా చొచ్చుకువస్తున్నారు. ఇటీవలే బారాముల్లా జిల్లాలో ఎల్వోసీ నుంచి టెర్రరిస్టులు దేశంలోకి చొరబడ్డారు. వీరిని అడ్డుకోవడానికి ఆర్మీ ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా ఉరి సెక్టార్లోనూ మరో సారి చొరబాటు ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉరి సెక్టార్ నుంచి దేశంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చిన ఓ పాకిస్తాన్ ఉగ్రవాదిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. మరో ఉగ్రవాది కాల్పుల్లో హతమయ్యాడు. ఈ నెల 18వ తేదీ నుంచి సరిహద్దు గుండా పెద్దమొత్తంలో చొరబాటు యత్నాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా కనీసం మూడు చోట్ల నుంచి ఉగ్రవాదులు చొరబాటు జరిగినట్టు తెలిసింది. ఈ విషయం తెలియరాగానే ఆర్మీ చొరబాట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అవే చొరబాట్లలో కశ్మీర్లో అడుగుపెట్టిన ఇతర టెర్రరిస్టుల కోసం జల్లెడపడుతున్నారు.
ఉరి సెక్టార్లో అనుమానాస్పద పరిస్థితులు కనిపించగానే ఆర్మీ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్ మొదలైంది. శనివారం నుంచి ఈ ఆపరేషన్ జరుగుతున్నది. ఇందులో భాగంగా తారసపడ్డ టెర్రరిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వీరిని పట్టుకునే క్రమంలో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు.