భారత్ పై పాక్ కాల్పులు, తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ
తాజాగా గురువారం తెల్లవారుజామున పాక్ సైనికులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ కృష్ణాఘాటి సెక్టారులో ఆరుగంటలకు కాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను పసిగట్టిన భారత సైనికులు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
శ్రీనగర్ :భారత్ పాకిస్థాన్ ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఒకవైపు శాంతిమంత్రాన్ని జపిస్తూనే మరోవైపు దాడులకు పాల్పడుతోంది పాకిస్థాన్. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో చర్చలకు తాము సిద్ధం అంటూ ప్రకటించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకవైపు చర్చలు, శాంతి అంటూ చెప్పుకొస్తున్న పాకిస్థాన్ మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
తాజాగా గురువారం తెల్లవారుజామున పాక్ సైనికులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ కృష్ణాఘాటి సెక్టారులో ఆరుగంటలకు కాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను పసిగట్టిన భారత సైనికులు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
పాక్ కాల్పులను తిప్పి కొట్టారు. ఈ కాల్పులు సుమారు గంటపాటు కొనసాగాయి. పాక్ సైన్యం కాల్పులు జరిపిన నేపథ్యంలో రాజౌరి జిల్లా మంజాకోటి సెక్టార్ లోనూ భారత జవాన్లు అప్రమత్తమయ్యారు.