పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ మే 7 నుండి కనిపించకుండా పోయారు. ఆయన మృతదేహం శ్రీరంగపట్నం దగ్గర కావేరీ నదిలో పోలీసులు కనుగొన్నారు.

శ్రీరంగపట్నం:

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ గత వారం నుంచి కనిపించకుండా ఉన్న ఘటన విషాదంగా మారింది. ఆయన మృతదేహాన్ని కర్ణాటకలోని శ్రీరంగపట్నం ప్రాంతంలో కావేరీ నదిలో పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.70 ఏళ్ల అయ్యప్పన్ ప్రస్తుతం తన భార్యతో కలిసి మైసూరు నగరంలోని విశ్వేశ్వర నగర్ పారిశ్రామిక ఏరియాలో నివసిస్తున్నారు. మే 7న ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. మొదట కుటుంబ సభ్యులు ఆయన్ను అన్వేషించినా ఫలితం లేకపోవడంతో మే 10న విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో తాము ఫిర్యాదు చేశారు.

 నది ఒడ్డున ఓ గుర్తు తెలియని మృతదేహం కనిపించిందన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, అది డాక్టర్ అయ్యప్పన్ దేహంగా గుర్తించారు. అదే సమయంలో ఆయన స్కూటర్ కూడా నది దగ్గరలోనే వదిలిపెట్టినట్టుగా లభించింది.మరణానికి గల కారణం స్పష్టంగా తెలియకపోయినా, ప్రాథమికంగా ఆయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పూర్తి కారణాన్ని అధికారికంగా నిర్ధారించేందుకు శ్రీరంగపట్నం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయ్యప్పన్ మత్స్యశాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. ఆయన భారత ప్రభుత్వంలో వివిధ హైప్రొఫైల్ పదవులు నిర్వహించి, దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి పనిచేశారు. బ్లూ రివల్యూషన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.ప్రస్తుతం డాక్టర్ అయ్యప్పన్ అకాల మరణం శాస్త్రీయ వర్గాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పూర్తి సమాచారం కోసం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.