'డీమోనిటైజేషన్ డే' ను జరుపుకోవాలి.. బీజేపీకి ఒవైసీ సవాల్
నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కిన ఘన విజయంగా బీజేపీ అభివర్ణించింది. అదే సమయంలో 'డిమోనిటైజేషన్ డే' జరుపుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీకి సవాల్ విసిరారు.
నోట్ల రద్దుపై అసదుద్దీన్ ఒవైసీ: నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రధాని మోదీపై విమర్శాస్త్రాలను సంధిస్తునే ఉంటాయి.ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.పెద్దనోట్ల రద్దును(డీమోనిటైజేషన్) సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ తరుణంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. 'డిమోనిటైజేషన్ డే' జరుపుకోవాలని ఒవైసీ మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నోట్ల రద్దు వల్ల 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఒవైసీ మండిపడ్డారు. అంతే కాదు జీడీపీ పతనం వెనుక డీమోనిటైజేషన్ హస్తం ఉందని, 2016-17లో 8.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు 2019-20లో 4 శాతానికి తగ్గిందని అన్నారు. డీమోనిటైజేషన్ ఇంత పెద్ద సక్సెస్ అయితే.. బీజేపీ ఎందుకు డిమోనిటైజేషన్ డే జరుపుకోవడం లేదని ఒవైసీ అన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు అప్పులు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పేదలు మరింత పేదలుగా మారారని విమర్శలు గుప్పించారు.
ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ, “మహిళలు, రోజువారీ కూలీ కార్మికులు, చేతివృత్తులవారు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు పెద్ద నోట్ల రద్దు వల్ల నష్టపోయారని ప్రధానికి తెలుసు. బీజేపీ 'నోటుబండి దివస్' ఎందుకు జరుపుకోదు?" 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని పలు నివేదికలు పేర్కొన్నాయని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత పేదలు పెద్ద మొత్తంలో రుణాల బారిన పడ్డారనీ, ప్రధాని ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆయన అసమర్థతను తెలియజేస్తోందని విమర్శించారు. అప్పట్లో రూ.17.97 లక్షలుగా ఉన్న కరెన్సీ నేడు రూ.32.18 లక్షల కోట్ల చలామణిలో ఉందని ఒవైసీ ఆరోపించారు.
పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీం కోర్టు
2016 నవంబర్లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థిస్తూ 4:1 తీర్పును వెలువరించింది. నిర్ణయం తీసుకునే విధానం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది. అటువంటి విధానానికి సంబంధించిన విషయాలలో సంయమనం పాటించాలని, న్యాయస్థానం తన నిర్ణయాన్ని న్యాయ సమీక్ష ద్వారా ఎగ్జిక్యూటివ్ విజ్ఞతను భర్తీ చేయలేమని జస్టిస్ ఎస్ ఎ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అయితే.. ఈ నిర్ణయం తీసుకునే ముందు అన్ని విధానాలను సక్రమంగా పాటించారా అనే ప్రశ్నపై జస్టిస్ బివి నాగరత్న ఇతర న్యాయమూర్తులతో విభేదించారు. నోట్ల రద్దు నోటిఫికేషన్ను చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
కొత్త సంవత్సరం మొదటి రోజున దాడి
ఆదివారం అంటే కొత్త సంవత్సరం తొలిరోజే మోడీ ప్రభుత్వంపై ఒవైసీ విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం పేదల రేషన్లో కోత పెట్టిందని ఆరోపించారు. 81 కోట్ల మంది పేదల రేషన్ను మోదీ ప్రభుత్వం 50% తగ్గించిందని, ఇప్పుడు 10 కిలోల బదులు 5 కిలోల రేషన్ మాత్రమే లభిస్తుందని, ఇందులో పేద కుటుంబం ఎలా బతకగలదని, రేషన్ పేదల హక్కు అని ఒవైసీ ట్వీట్ చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యను పరిష్కరించే బదులు ప్రభుత్వం పేదల కష్టాలను పెంచుతోందని ఆరోపించారు.