'నితీష్, తేజస్విలు రాజీనామా చేస్తారా?': బీహార్ బ్రిడ్జి కుప్పకూలడంపై బీజేపీ విమర్శలు
బీహార్లోని భాగల్పూర్లో వంతెన కూలిన ఘటనపై సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రతిపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు.
బీహార్లోని భాగల్పూర్లో సుల్తాన్గంజ్ను అగువానీ ఘాట్తో అనుసంధానించేందుకు నిర్మిస్తున్న వంతెన గంగా నదిలో కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ విషయంలో మహాకూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. వంతెన కూలిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మామ-మేనల్లుడు (నితీష్-తేజస్వి) రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి అశ్విని చౌబే అన్నారు. కొన్ని నెలల వ్యవధిలో ఈ వంతెన రెండవసారి కూలిపోయింది.
భాగల్పూర్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ.. ఈ నిర్మాణంలో ఉన్న వంతెన రెండుసార్లు కూలిపోయిందని, నితీష్ తేజస్విలో ఏదైనా నైతికత మిగిలి ఉంటే.. వారు వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. మొదట ఒక స్తంభం మునిగిపోయింది, తర్వాత వంతెన వంగడం ప్రారంభించింది... మహాసేతు 10 నిమిషాల్లో కూలిపోయింది
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ ట్వీట్ చేస్తూ.. 'బీహార్లో అవినీతి ప్రబలంగా ఉందనడానికి మరొక ఉదాహరణ చూడండి, అగువానీ-సుల్తాన్గంజ్ గంగా వంతెన మరోసారి కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడం అవినీతిని చాటి చెబుతోంది. ఈ ఘటనను తక్షణమే గ్రహించి, మామ-మేనల్లుడు రాజీనామా చేసి దేశం ముందు ఆదర్శంగా నిలవాలి. అని పేర్కొన్నారు.
వంతెన కూలిన తర్వాత తేజస్వి క్లారిటీ
వంతెన కూలిన తర్వాత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ఇది మొదటిసారి జరగలేదని, ఏప్రిల్ 2022 లో కూడా ఈ నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిందని, మేము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దానిపై ప్రశ్నలు లేవనెత్తామని అన్నారు. రోడ్డు నిర్మాణ విభాగం పనిని చేపట్టిన తర్వాత ఐఐటీ రూర్కీ ద్వారా వంతెనను పరిశీలించామని, దాని ఆధారంగా వంతెన నిర్మాణ డిజైన్లో లోపం కనిపించిందని తేజస్వి యాదవ్ చెప్పారు. దీని తరువాత దెబ్బతిన్న భాగాన్ని పునర్నిర్మించే పనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఐఐటీ బాంబే రిపోర్టు రావాల్సి ఉందని అన్నారు.
1717 కోట్లతో వంతెన నిర్మాణం
1717 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఏప్రిల్లో వచ్చిన తుఫాను కారణంగా నిర్మాణంలో ఉన్న ఈ వంతెనలో కొంత భాగం కూడా దెబ్బతింది. ఖగారియా-అగువానీ-సుల్తాన్గంజ్ మధ్య గంగా నదిపై నిర్మిస్తున్న మహాసేతు మధ్య భాగం కుప్పకూలింది. వంతెన ఎగువ భాగం నదిలో మునిగిపోయింది. నాలుగేళ్ల క్రితం సీఎం నితీశ్కుమార్ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు.