కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని కేంద్రం తెలిపింది. ప్రభుత్వంలో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని కేంద్రం తెలిపింది. 2021 మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం తెలిపారు. ఇందులో అత్యధికంగా రైల్వే శాఖలో 2.93 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డిఫెన్స్ (సివిల్)లో 2.64 లక్షలు, హోం శాఖలో 1.43 లక్షలు, పోస్టుల్లో 90,050, రెవెన్యూలో 80,243, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో 25,934, అణు ఇంధన విభాగంలో 9,460 ఖాళీలు ఉన్నాయని వ్యయ శాఖ వార్షిక నివేదికను ఉటంకిస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. ‘‘భర్తీ చేయని పోస్టులను సకాలంలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వం రోజ్‌గార్ మేళాలు మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ఆశిస్తున్నాము’’ అని ఆయన పేర్కొన్నారు.