లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి.
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఈ నెల 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ విషయమై అప్పీల్ చేసేందుకు సూరత్ కోర్టు సమయం ఇచ్చింది. అయినా కూడా ఈ నెల 24వ తే0దీన రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ వెలువరించింది.ఈ పరిణామంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ కు ఇతర బీజేపీయేతర పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తుంది ఈ క్రమంలోనే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాసం ప్రవేశ పెట్టాలనే యోచనతో విపక్షాలున్నాయి. వచ్చే సోమవారంనాడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందని సమాచారం.
స్పీకర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి లోక్ సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ విషయమై విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని సమాచారం.
రాహుల్ గాంధీ విషయంలో స్పీకర్ కార్యాలయం తొందరపడిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.ఈ విషయమై స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ విషయమై ఇవాళ జరిగిన పార్టీ సమావేశంలో కొందరు ఎంపీలు అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా పలు రకాాల కార్యక్రమాలను ఆ పార్టి చేపట్టింది.
