మణిపూర్ హింస: ఇండియా కూటమి ఎంపీలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్.. ఉదయం 11.30 గంటలకు..!
మణిపూర్ హింస గురించి మాట్లాడటానికి ఆ రాష్ట్రం పర్యటించి వచ్చిన ఇండియా కూటమి ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరారు. ఉదయం 11.30 గంటలకు కలవాలని రాష్ట్రపతి వారికి సూచించారు.
న్యూఢిల్లీ: మణిపూర్ హింస కేంద్రంగా విపక్ష ఎంపీలు పార్లమెంటులో తీవ్ర ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మణిపూర్ రాష్ట్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మణిపూర్ గవర్నర్ అనుసూయి యూకిని కలిశారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మెమోరాండం సమర్పించారు. అదే విధంగా మణిపూర హింసపై చర్చించడానికి ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ను కూడా కోరారు. అందుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బుధవారం ఉదయం 11.30 గంటలకు విపక్ష ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం కావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. ఉదయం 11.30 గంటలకు కలవాలని ఆమె ఇండియా కూటమి ఎంపీలకు సూచనలు చేశారు.
ఇదిలా ఉండగా, మణిపూర్లో రాజ్యాంగ యంత్రాంగం విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తోందని దేశ అత్యుతున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మణిపూర్లో చోటుచేసుకున్న హింసాకాండకు సంబంధించిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. అందులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు జరిపిన ఘటనకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్లో పరిస్థితులపై సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది.
Also Read: హర్యానా ఘర్షణలు: ఐదుగురు మృతి.. 44 ఎఫ్ఐఆర్ లు నమోదు, 70 మంది అరెస్ట్
మంగళవారం విచారణ సందర్భంగా.. మణిపూర్లో దర్యాప్తు నీరసంగా సాగుతుందని సీజేఐ ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘విచారణ చాలా నీరసంగా ఉంది. అరెస్టులు చేయలేదు. ఇంత కాలం గడిచిన తర్వాత స్టేట్మెంట్లు రికార్డ్ చేయబడుతున్నాయి మే ప్రారంభం నుంచి జూలై చివరి వరకు ఎటువంటి చట్టం లేదని.. రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేశారనే అభిప్రాయాన్ని ఇది కలిగిస్తుంది’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. విచారణలో పురోగతి లేకపోవడం వల్ల, గణనీయమైన సమయం గడిచినప్పటికీ ఎటువంటి అరెస్టులు జరగలేదని వ్యాఖ్యానించారు.