పాకిస్తాన్, పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ దాడులకు ముందు, తర్వాత ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
మే 7న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన తొమ్మిది కీలక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ధ్వంసమైన స్థావరాల్లో ఐదు పీఓకేలో ఉండగా, మిగిలిన నాలుగు పాకిస్తాన్ అంతర్గత భూభాగంలో ఉన్నాయి. వీటిలో రెండెక్కువగా ప్రాముఖ్యమైనవి, ఇవి ఉగ్రవాద కమాండర్ల నివాసాలతో పాటు శిక్షణా కేంద్రాలుగా కూడా ఉపయోగించబడుతున్నాయి.ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, ఎయిర్ మార్షల్ ఎకె భారతి మాట్లాడుతూ మురిద్కేలోని లష్కర్ ప్రధాన కేంద్రం మార్కజ్ తైబా, బహవల్పూర్లోని జైషే మహ్మద్ కార్యాలయం మార్కజ్ సుభాన్ అల్లా లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించారు.
ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్న భవనాలపైనే దాడులు జరిగాయని, పౌరులకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. మురిద్కేలోని నలభై భవనాలపై దాడి జరిపారని, ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన కీలక నేత ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ మరణించాడని తెలిపారు.ఇక బహవల్పూర్ దాడిలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్ మృతిచెందాడు.ఈ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘై వెల్లడించారు. వారిలో 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 హైజాకింగ్ ఘటన, అలాగే 2019 పుల్వామా ఉగ్రదాడి ఘటనలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
భారత దళాలు విడుదల చేసిన వీడియోలు, ఫోటోల ఆధారంగా ఉగ్రవాద కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని స్పష్టమవుతోంది. పౌరులైన వారు, సైనిక నిర్మాణాలు దెబ్బతినకుండా నిఖార్సైన ప్రణాళికతో ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు సమాచారం.ఈ దాడులు పాకిస్తాన్ భూభాగం మీద భారత దళాలు నిర్వహించిన అరుదైన అతి ముఖ్యమైన వైమానిక చర్యలుగా చరిత్రలో నిలిచిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.