సారాంశం
భారత్కు గట్టి సవాలుగా మారిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం)పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా పోరాటం సాగిస్తోంది. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో, కేంద్రం అత్యంత భారీ స్థాయిలో “మిషన్ సంకల్ప్”ను ప్రారంభించింది. దాదాపు 24,000 మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో కూడిన బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి.
కర్రెగుట్ట మీదే ప్రధాన దృష్టి:
ఈ ఆపరేషన్లో కర్రెగుట్ట కొండలు ముఖ్యమైన లక్ష్యంగా మారాయి. ఈ ప్రాంతం మావోయిస్టులకు బలమైన స్థావరంగా ఉపయోగపడుతోంది. అందువల్లే అక్కడే ప్రధానంగా దాడులు కొనసాగుతున్నాయి. దట్టమైన అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులను పట్టుకునేందుకు డ్రోన్లు, శాటిలైట్ వ్యవస్థను అధికారులు ఉపయోగిస్తున్నారు.
మిషన్ సంకల్ప్ లక్ష్యాలు:
ఈ ఆపరేషన్ ప్రధానంగా మావోయిస్టుల బేస్ క్యాంపులను ధ్వంసం చేయడమే కాకుండా, వారి సంచార మార్గాలు, ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ నెట్వర్క్ను అడ్డుకోవడంపైనా దృష్టి పెట్టింది. మావోయిస్టు కీలక నేతలు మడవి హిడ్మా, పుల్లురి ప్రసాద్ రావు, సుజాత, బార్సె దేవా వంటి వారే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. అమిత్ షా హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ మరింత వేగవంతమైంది.
మావోయిస్టు చరిత్ర, విస్తరణ:
నక్సలిజానికి మూలం 1967లో బంగాల్లోని నక్సల్బరి నుంచి మొదలైంది. అక్కడి రైతుల తిరుగుబాటుతో ఇది మొదలై, ఇప్పుడు జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ వరకు విస్తరించింది. మావోయిస్టులు గిరిజనుల భూములపై హక్కుల పేరిట తమ ఉనికిని కొనసాగిస్తూ, ప్రజలను ఆకట్టుకుంటూ వచ్చారు.
పురోగతి:
ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు చాలా మావోయిస్టు స్థావరాలు ధ్వంసం అయ్యాయి. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పలువురు కీలక నాయకులను హతమార్చారు. కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భూగర్భ దావఖానాలు, క్యాంపులను ధ్వంసం చేశారు.
సవాళ్లతో కూడిన ప్రగతి:
అయితే, దట్టమైన అడవులు, బాంబుల వలలు, హిట్ అండ్ రన్ దాడులు వంటి మావోయిస్టుల వ్యూహాలు భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నాయి. అయినా, ఇప్పటికే భద్రతా దళాలు చాలా భద్రతా ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చాయి.
ఆదివాసీలపై ప్రభావం:
దశబ్ధాలుగా మావోయిస్టుల చెరలో ఉన్న ఆదివాసీలు ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన వైపు వస్తున్నారు. మిషన్ సంకల్ప్ వల్ల వెలివేతలకు గురైన గ్రామాలకు మళ్లీ ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
దీర్ఘకాల ప్రణాళిక:
ఆపరేషన్ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి మార్చి 2026 వరకు గడువు నిర్ణయించారు. మావోయిస్టుల అంతంతో పాటు మౌలిక సదుపాయాలు, పునరావాస కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు కూడా చేపడుతున్నారు. మిషన్ విజయవంతం అయితే వామపక్ష తీవ్రవాదానికి పూర్తిగా చెక్ పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయడపడుతున్నారు.
ఆపరేషన్ కగార్ ద్వారా సాదించింది ఏంటి.?
* మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రభావాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ వేగంగా కొనసాగుతోంది. ఇది 2024 నుంచే తీవ్రతరమైంది.
* ఈ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 120 మంది మావోయిస్టులు హతమయ్యారు. కేవలం 80 రోజుల వ్యవధిలోనే ఇది సాధ్యమైంది.
* ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 20 వరకు జరిగిన ఘర్షణల్లో వరుసగా 48, 40, 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది భద్రతా బలగాల దూకుడు ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టంచేస్తోంది.
* ఆపరేషన్ కగార్ ప్రారంభమయ్యాక.. గురువారం (మే 7వ తేదీ) నాటి రెండు ఎన్కౌంటర్లతో కలిపి ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 120కి చేరింది. కేవలం 80 రోజుల వ్యవధిలోనే 120 మంది మరణించారు.
* భద్రతా బలగాలు మావోయిస్టుల కీలక నేతల్ని లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టులు భద్రత కోసం తరలిపోవాలనుకుంటున్నా, పరిసర ప్రాంతాలన్నీ బలగాలతో నిండి ఉండటంతో వారు చిక్కుల్లో పడుతున్నారు.
* గత 25 సంవత్సరాలలో 14 రాష్ట్రాల్లో మావోయిస్టులు ప్రభావం చూపినప్పటికీ, ప్రస్తుతం వారికీ ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ లాంటి కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే స్థిరమైన పట్టు ఉంది. ఛత్తీస్గఢ్లో కేంద్ర నేతృత్వంలోని మావోయిస్టుల ప్రధాన కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం.
* 2019 నుండి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లోనే 250 సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యాయి. ఇకపై ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక భద్రతా శిబిరాన్ని నిర్మించేలా కసరత్తు సాగుతోంది.
* ఈ ఆపరేషన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీస్ విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి.
* మావోయిస్టుల స్థావరాలపై దాడులు, అరెస్టులు, ఆయుధాల స్వాధీనం వంటి చర్యలు ఈ ఆపరేషన్లో భాగంగా నిత్యం చోటు చేసుకుంటున్నాయి.
విమర్శలు సైతం:
అయితే ఈ ఆపరేషన్పై వ్యతిరేక స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు దీనిని శాంతి స్థాపనకు కీలకంగా అభివర్ణించగా, మరికొందరు మానవ హక్కుల ఉల్లంఘనగా విమర్శిస్తున్నారు. ప్రొఫెసర్ జి. హరగోపాల్ వంటి వ్యక్తులు ఆపరేషన్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీలపై భద్రతా బలగాల దమనకాండపై దేశ వ్యాప్తంగా చర్చ అవసరమని అభిప్రాయపడుతున్నారు.