విడాకుల కోసం ఏడాది విడిగా ఉండక్కర్లేదు: కేరళ హైకోర్టు
మ్యూచువల్ డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూడా కచ్చితంగా ఏడాదిపాటు వేర్వేరుగా ఉండాలనే నిబంధన అవసరం లేదని కేరళ హైకోర్టు తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది.
తిరువనంతపురం: కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉభయుల అంగీకారంతో దాఖలయ్యే విడాకుల అప్లికేషన్లో ఇద్దరినీ ఏడాదిపాటు విడిగా ఉండాలని, ఆ తర్వాత విడాకుల పిటిషన్ ఫైల్ చేయాలని ఆదేశించిన చట్టాన్ని కేరళ హైకోర్టును కొట్టేసింది. ఇది రాజ్యాంగవిరుద్ధం అని, వారి ప్రాథమిక హక్కులను హరిస్తున్నదని వివరించింది. జస్టిస్ ఏ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ శోభ అన్నమ్మ ఈపెన్ల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఇద్దరూ మ్యూచువల్గా డైవర్స్ కావాలని కోరుకున్నప్పుడు కనీసం ఏడాదిపాటు వేర్వేరుగా జీవించాలని చెప్పే చట్టం పౌరుల స్వేచ్ఛను హరిస్తున్నదని వివరించింది. ముఖ్యంగా భారత విడాకుల చట్టం పరిధిలోకి వచ్చే క్రిస్టియన్ పౌరుల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపింది.
ఈ ఏడాది తొలినాళ్లలో క్రిస్టియన్ మత విధానంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు దంపతులు.. స్వల్ప కాలంలోనే వారు పెళ్లి చేసుకోవడం తప్పు అని తెలుసుకున్నారు. ఇద్దరు కలిసి ఈ ఏడాది మే నెలలో ఫ్యామిలీ కోర్టులో విడాకుల చట్టంలోని సెక్షన్ 10ఏ కింద పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. విడాకులకు ముందు వారు వేర్వేరుగా ఒక ఏడాదిపాటు జీవించాలని ఆదేశించింది.
Also Read: భార్యపై భర్త స్నేహితుడి అత్యాచారం.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
దీంతో పిటిషనర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానం గడపదొక్కారు. యాక్ట్లోని సెక్షన్ 10(ఏ) రాజ్యాంగ విరుద్ధమైనదని ఆ దంపతులు రిట్ పిటిషన్ వేశారు.
ఒక వేళ భార్య భర్తలు ఎదుర్కొన్న కష్టాలు, బాధలను చెప్పుకునే అవకాశం ఇవ్వకుంటే అది ఒకరకమైన అణచివేతే అవుతుందని హైకోర్టు తెలిపింది.
మ్యూచువల్ కన్సెంట్తో దాఖలయ్యే డైవర్స్ పిటిషన్లను విచారణకు వేగంగా తీసుకోవాలని, రెండు వారాల వ్యవధిలోనే తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును కేరళ హైకోర్టు ఆదేశించింది. మరోసారి పిటిషనర్లు కోర్టులో హాజరు కావాల్సిన అవసరం పెట్టకుండానే విడాకులు మంజూరు చేయాలని తెలిపింది.
అంతేకాదు, ఈ తీర్పులో హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కూడా పలు సూచనలు చేశారు.యూనిఫామ్ మ్యారేజ్ కోడ్ను రూపొందించటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేసింది.