కుల్గామ్లో ఎన్కౌంటర్... ఇద్దరు పౌరులు, ఒక సైనికుడికి..
జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు పౌరులు, ఒక సైనికుడు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కుల్గామ్లోని బట్పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు.
జమ్మూకశ్మీరులో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్గామ్ జిల్లాలో పౌరుల లక్ష్యంగా కాల్పులు జరిపారు. కుల్గామ్లోని బట్పోరా గ్రామంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు, ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం ప్రచారం.. కుల్గామ్లోని బట్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు సోమవారం ఉదయం భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. భద్రతా బలగాలు రహస్య స్థావరం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు.
అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురుదాడి చేశారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాన్తో పాటు ఇద్దరు పౌరులు గాయపడ్డారు. అలాగే.. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసు అధికారి తెలిపారు. అతడ్ని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిగా గుర్తించారు. అక్కడ ఇంకా ఉగ్రవాదుల గురించి గాలింపులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
.
అంతకుముందు.. ఆదివారం తెల్లవారుజామున కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అప్రమత్తమైన సైనికులు చొరబాటుదారులపై గాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయనే సమాచారం వచ్చింది. దీంతో భద్రతా బలగాల సంయుక్త బృందం మచిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి నిఘా పెంచింది. ఆదివారం ఉదయం భద్రతా బలగాలు కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి.
భద్రతా బలగాలు వారిని సవాలు చేయడంతో.. చొరబాటుదారులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి 2 ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, 4 గ్రెనేడ్లు, ఆహారం, ఇతర యుద్ధ సన్నాహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ట్వీట్ చేసింది.