Jamili Elections: జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. లా కమిషన్ రిపోర్ట్ సిద్ధం.. !
One Nation, One Election: జమిలి ఎన్నికల గురించి గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' పట్ల బీజేపీ ఎప్పటి నుంచో నిబద్ధతను చాటుకుంటున్నప్పటికీ, రహస్య ఎజెండా ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరో తొమ్మిది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా 'జమిలి ఎన్నికల' అంశాన్ని లేవనెత్తుతోందని కొందరు భావిస్తున్నారు. ఈ పరిణామం వివిధ రాజకీయ పార్టీల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, జమిలి గ్రీన్ సిగ్నల్ కు సర్వం సిద్ధమైందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

One Nation, One Election: జమిలి ఎన్నికల గురించి గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్నదే జమిలీ ముఖ్య ఉద్దేశం. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' పట్ల బీజేపీ ఎప్పటి నుంచో నిబద్ధతను చాటుకుంటున్నప్పటికీ, రహస్య ఎజెండా ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరో తొమ్మిది నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా 'జమిలి ఎన్నికల' అంశాన్ని లేవనెత్తుతోందని కొందరు భావిస్తున్నారు. ఈ పరిణామం వివిధ రాజకీయ పార్టీల్లో ఆసక్తిని రేకెత్తించింది.
అయితే, జమిలి ఎన్నికల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ గత కొంతకాలంగా జమిలీ ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతున్నారు. లోక్ సభ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనీ, ఒకే దేశం ఒకే ఎన్నికల బలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదన కీలక దశకు చేరుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం లా కమిషన్ కు సిఫార్సు లో ఉండగా, ఈ ప్రతిపాదన అమలుకు రోడ్ మ్యాప్ తయారు చేయాలని న్యాయ కమిషన్ ను కేంద్రం కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక లా కమిషన్ సైతం జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపునట్లు సమాచారం. ఒకే దేశం, ఒకే ఎన్నికలతో పెద్ద మొత్తంలో ప్రజాధనంతో పాటు సమయం ఆదా అవుతుందనీ, పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే దేశరాజధాని ఢిల్లీలో లా కమిషన్ భేటీ అవుతోంది. జమిలి ఎన్నికల రిపోర్టుపై చర్చించనుంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పటికే జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని ప్రకటించగా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఇదిరకు భేటీ అయిన ఈ కమిటీ.. తదుపరి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, లా కమిషన్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది.
దీంతో ప్రస్తుతం జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక కీలకం కానుంది. ఈ నివేదికలో లా కమిషన్ పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. 2024, 2029 లో జమిలీ తరహాలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి నివేదించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకే దేశం, ఒకే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ పై సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి లా కమిషన్ భేటీ తర్వాత కేంద్ర న్యాయ శాఖకు ఈ రిపోర్టు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, ఒకే దేశం ఒకే ఎన్నికల గురించి 2018లో జస్టిస్ బిఎస్ చౌహన్ నేతృత్వంలోని 21వ లా కమిషన్ ముసాయిదా నివేదిక బీజం వేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జమిలి పై అనుకూల స్పందనలు చేయడంతో ప్రస్తుత లా కమిషన్ చైర్మన్ రీతూరాజ్ అవస్తి నేతృత్వంలో జరగబోయే భేటీ కీలకం కానుంది. ఇదే సమయంలో‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ నివేదిక ఇంకా ఖరారు కాలేదని, ఇంకా సమయం పడుతుందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్తీ ఇదివరకు పేర్కొనడం గమనార్హం. అలాగే, జమిలిపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు సైతం కీలకం కానుండటంతో మరోసారి జమిలి హాట్ టాపిక్ అవుతోంది. కాగా, గతంలో, 1951-52, 1957, 1962, 1967లో లోక్సభ-అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి.