ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదు.. తేలికగా తీసుకోకండి - కేంద్రం
ఒమిక్రాన్ ను సాధారణ జలుబు కాదని, దానిని తేలికగా తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ -19 కేసుల కేసుల దృష్ట్యా కొత్త ఢిశ్చార్జి విధానాన్ని విడుదల చేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant) సాధారణ జలుబు కాదని దానిని తేలికగా తీసుకోవద్దని కేంద్రం హెచ్చరించింది. దేశంలో కోవిడ్ -19 (covid -19) థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు (third wave peak stage) చేరుకోవడం, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేసు తీవ్రత ఆధారంగా ఆసుపత్రుల డిశ్చార్జ్ విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సవరించింది. ఈ కొత్త పాలసీ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ (love agarwal) వెల్లడించారు. కోవిడ్ - 19 పరిస్థితిపై ప్రధాని మోడీతో (pm modi) సమావేశం నిర్వహించిన తరువాత ఈ ఢిశ్చార్జి విధాన్ని మైల్డ్, మోడరేట్ కేసులుగా వర్గీకరించామని తెలిపారు.
ఈ కొత్త పాలసీ ప్రకారం .. ‘మైల్డ్ కేస్ డిశ్చార్జ్’ అంటే కనీసం రోగికి పాజిటివ్ గా వచ్చిన 7 రోజుల తరువాత వరుసగా మూడు రోజుల పాటు వ్యాధి లక్షణాలు లేకపోతే డిశ్చార్జ్కు ముందు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. 'మోడరేట్ కేస్ డిశ్చార్జ్’ అంటే రోగికి మెడికల్ ఆక్సిజన్ సహాయం లేకుండా వరుసగా మూడు రోజుల పాటు శరీరంలో ఆక్సిజన్ శాతం 93 కంటే ఎక్కువగా ఉంటే అతడిని డిశ్చార్జ్ చేయవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డెల్టా (delta) కంటే ఒమిక్రాన్ (Omicron) అధికమైన వ్యాప్తిని కలిగి ఉండని లవ్ అగర్వాల్ అన్నారు. దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, డెన్మార్క్ నుండి వచ్చిన డేటాని పరిశీలించినప్పుడు డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కు ఆసుపత్రిలో చేర్చే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించాయని తెలిపారు. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 115 మరణాలు సంభవించగా.. వాటిలో 1 మరణం ఇండియాలో కూడా ఉందని అన్నారు.
ఈ కొత్త డిశ్చార్జి పాలసీ విషయంలో ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ.. రిస్క్ కాంటాక్ట్ కేసులను, లక్షణాలు ఉన్న కేసులను పరీక్షించాల్సిన అసవరం ఉందని అన్నారు. అయితే లక్షణాలు లేని కేసులను కొన్ని సందర్భాల్లో తప్ప పరీక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రోగితో కాంటాక్ట్ లో ఉన్న వారందరూ తప్పకుండా 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని అన్నారు.
నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. వైరస్ నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు అధికంగా మందులు వాడకూడదని అన్నారు. ఓమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదు, దీన్ని తేలికగా తీసుకోకూడదని తెలిపారు. ప్రస్తుతం పెరుగుదల ఓమిక్రాన్ కారణంగా ఉందని అన్నారు. ఇది డెల్టాను భర్తీ చేసిందని అన్నారు. ఔషధ వినియోగం కోసం హేతుబద్ధమైన విధానం ఉండాలని అన్నారు. డ్రగ్స్ మితిమీరిన వినియోగం, దుర్వినియోగం విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు. మందులు అధికంగా ఉపయోగిస్తే.. తరువాత పరిణామాలు ఉంటాయని చెప్పారు.