వేరే కులం వారి ఇంట్లో భోజనం చేశారని...
కొరాపుట్ జిల్లా జయపురం సమితి బదిలిగుడ గ్రామానికి చెందిన అర్జున మాలి ఈ నెల 11 వ తేదీన మరణించాడు. ఆయనకు కుమారులు లేరు.
ఓ వైపు ప్రపంచం శాస్త్ర, సాకేంతిక రంగాల్లో దూసుకుపోతోంది. ఒక్కో దేశం మరో దేశంతో పోటీ పడుతోంది. ఇలాంటి రోజుల్లోనూ ఇంకా కులం, మతం, జాతి అంటూ పట్టుకొని వేలాడుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ కారణంగా ఓ ఇద్దరు అక్కాచెళ్లెళ్లకు కనీసం తండ్రి అంత్యక్రియలు చేయడానికి కూడా అంగీకరించలేదు. ఈ దారుణ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఒరిస్సా, కొరాపుట్ జిల్లా జయపురం సమితి బదిలిగుడ గ్రామానికి చెందిన అర్జున మాలి ఈ నెల 11 వ తేదీన మరణించాడు. ఆయనకు కుమారులు లేరు. ఉన్నది ఇద్దరు కుమార్తెలు. కొడుకు లేకపోవడం వల్ల తండ్రి దహన సంస్కారాల బాధ్యత ఇద్దరు కుమార్తెల పైన పడింది.
అయితే ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇటీవల ఒక గదబ సామాజిక కుటుంబం వారి విందులో పాల్గొని భోజనం చేశారని అందుచేత వారు జాతిని కోల్పోయారని మళ్లీ జాతిలో చేరి తండ్రి అంత్యకియలు జరపాలంటే శిక్ష అనుభవించాలని పెద్దలు తీర్పు చెప్పారు.
అందుకు అక్కాచెల్లెళ్లు అంగీకరించారు. పెద్దల తీరానం మేరకు ఆ ఇద్దరి యువతులకు గుండు గీశారు. గుండు గీసిన అనంతరం గ్రామ పెద్దలు వారి తండ్రి దహన సంస్కరాలు చేసేందుకు అనుమతిచ్చారు. కాగా.. ఆలస్యంగా ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో... ఈ ఘటనపై దృష్టిసారించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.