ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కూతురు మృతదేహానికి పోస్ట్మార్టం కోసం 8 కి.మీ. పాటు ముకుంద్ అనే వ్యక్తి నడిచాడు.
భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో కూతురు మృతదేహానికి పోస్ట్మార్టం కోసం 8 కి.మీ. పాటు ముకుంద్ అనే వ్యక్తి నడిచాడు. ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గజపతి జిల్లా కలెక్టర్ విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఒడిశా రాష్ట్రంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముకుంద్ 7 ఏళ్ల కూతురు బబిత అక్టోబర్ 11వ తేదీన తిత్లీ తుఫాన్ వల్ల సంభవించిన వరదల్లో తప్పిపోయింది. మరునాడు ఆ చిన్నారి మహేంద్రగిరి వద్ద కొండ చరియల కింద బబిత మృతదేహాన్ని గుర్తించారు.బబిత మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహిస్తే ప్రభుత్వం నుండి పరిహారం అందే అవకాశం ఉంది.
బబిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మృతదేహాన్ని కైన్సూర్ ఆసుపత్రికి తీసుకురావాలని ముకుంద్కు అధికారులు చెప్పి వెళ్లిపోయారు.
దీంతో కూతురు మృతదేహాన్ని తీసుకొని ముకుంద్ నడుచుకొంటూ వెళ్లారు. కానీ అతనికి ఎవరూ కూడ సహాయం చేయలేదు. అయితే 8 కి.మీ దూరం నడిచిన తర్వాత ముకుంద్ తన కూతురు బబిత మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తున్న విషయాన్ని తెలుసుకొన్న పోలీసులు కైన్సూర్ వరకు ఆటోను ఏర్పాటు చేశారు.
బబిత మృతదేహన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని ఆయన చెప్పారు. వర్షం వల్ల తమ గ్రామానికి వచ్చే రోడ్డు కూడ దెబ్బతిందన్నారు. ముకుంద్ నడుచుకొంటూ తన కూతురి మృతదేహన్ని తీసుకెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో గజపతి జిల్లా కలెక్టర్ అనుపమ్ షా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు చెప్పారు. కూతురిని కోల్పోయిన ముకుంద్ కు ఒడిశా ప్రభుత్వం గురువారం నాడు రూ. 10 లక్షలను అందించింది. ఇదిలా ఉంటే ముకుంద్ తన కూతురి మృత దేహన్ని ఆసుపత్రికి నడుచుకొంటూ తీసుకెళ్లే వీడియోను ఒడిశా కాంగ్రెస్ పార్ట్టీ ట్వీట్ చేసింది.
