Odisha Man Married 18 Women: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలను వివాహం చేసుకున్న నిత్య పెళ్లికొడుకును ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిధు ప్రకాష్ స్వైన్ అనే వ్యక్తి 48 ఏళ్ల వ్యవధిలో ఏడు రాష్ట్రాలకు చెందిన 18 మంది మహిళలను వివాహం చేసుకొని మోసగించాడు.
Odisha Man Married 18 Women: పెళ్లిళ్లు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు ఒడిశాకు చెందిన 67 ఏళ్ల నిత్య పెళ్లి కొడుకు. తరుచు ప్రాంతాలు మారుస్తూ.. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడాడు. ఆ వల్ల మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లికొడుకును ఒడిశాలోని భువనేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తీరా అతని మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలిస్తే.. పోలీసులే కంగు తిన్నారు. దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిత్య పెళ్లి కొడుకు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలను వివాహం చేసుకున్నాడని తేల్చారు. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా.. ఆ నిత్య పెళ్లి కొడుకు తన మొబైల్ ఫోన్ లో భార్యల నెంబర్లను మేడమ్ ఢిల్లీ, మేడమ్ అస్సాం,మేడమ్ యుపి అని సేవ్ చేసుకున్నాడు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన బిధు ప్రకాష్ స్వైన్ అనే వ్యక్తి 48 ఏళ్ల వ్యవధిలో ఏడు రాష్ట్రాలకు చెందిన 18 మంది మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడు. అతని చివరి భార్య ఢిల్లీలో స్కూల్ టీచర్.. ఆమెకు తన భర్త పూర్వపు వివాహాల గురించి తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తీగ లాగితే సదరు నిత్యపెళ్లికొడుకు బిధు ప్రకాష్ స్వైన్ గారి డొంకంతా కదిలింది.
రమేష్ స్వైన్.. 1978లో తొలి వివాహమైంది. పలు కారణాలతో మొదటి భార్యను విడిచిపెట్టాడు. ఆ తర్వాత 2002లో రెండోసారి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. మనోడు అంతటితో ఆగకుండా.. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో డాక్టర్ అంటూ ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని సంబంధం వెతుక్కునేవాడు. 2002నుంచి 2020 సంవత్సరాల మధ్య కాలంలో అసెక్జానేరియన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా పలువురు మహిళలతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
ఆ నిత్య పెళ్లి కొడుకు మాట్రిమోనీ సైట్లలో ఎక్కువగా.. విడాకులు తీసుకుని, ఒంటరి జీవితం గడుపుతున్న మహిళల టార్గెట్ చేసేవాడనీ, తానొక డాక్టర్నని అబద్ధమాడుతూ వాళ్లను బుట్టలో వేసుకునేవాడని పోలీసులు తెలిపారు. అలా తన వలలో పడిన వారితో శారీరక సుఖం పొంది.. వారి నుంచి డబ్బు తీసుకుని పారిపోయేవాడని బాధితులు పేర్కొన్నారు. ఈ నిందితుడి ఉచ్చులో ప్రొఫెసర్లు, లాయర్లు, మెడిక్స్, పారామిలిటరీ దళంలో పనిచేసే మహిళలు ఉండడం గమనార్హం. నిందితుడికి ఢిల్లీ, పంజాబ్, అసోమ్, ఝార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాల్లో భార్యలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు
నిందితుడి వద్ద నుంచి 128 నకిలీ క్రెడిట్ కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులను మోసం చేయడం, రుణం పేరిట మోసం చేయడం వంటి నేరాలకు సంబంధించి గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. అలాగే..13 బ్యాంకుల నుంచి దాదాపు ₹ 1 కోటికి అప్పుగా తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
అతను పెళ్లి చేసుకోవడానికి ప్రధానంగా డబ్బు, తన లైంగిక కోరికలను తీర్చుకోవాలనే ఇలా చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నిందితుడు ఫిబ్రవరి , మార్చిలో మరో రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అత్యవసర పరిస్థితుల్లో అతనికి సహాయం చేయడానికి తన కొత్త భార్యల డబ్బు లేదా ఆభరణాలను అరువుగా తీసుకోవడానికి సాకులు చెప్పేవాడని పోలీసులు గుర్తించారు.
