కరోనాటైం.. దుబాయ్ వెళ్లడానికి రూ.55లక్షల ఖర్చు..!
వివిధ పనులపై గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చిన చాలామంది ప్రవాసులు ఇక్కడే ఇరుక్కుపోయారు. ఇక తప్పనిపరిస్థితుల్లో వెళ్లాల్సిన వారు చార్టడ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఇది వ్యయంతో కూడుకున్న వ్యవహారమైన తప్పడం లేదు.
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో చాలాప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇక విమానాల రాకపోకలపై కూడా నిషేధం కొనసాగుతోంది. దీంతో వివిధ పనులపై గల్ఫ్ నుంచి స్వదేశానికి వచ్చిన చాలామంది ప్రవాసులు ఇక్కడే ఇరుక్కుపోయారు. ఇక తప్పనిపరిస్థితుల్లో వెళ్లాల్సిన వారు చార్టడ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఇది వ్యయంతో కూడుకున్న వ్యవహారమైన తప్పడం లేదు.
తాజాగా అస్సాంకు చెందిన ప్రఖ్యాత వ్యాపారవేత్త, జమియత్ ఉలామా అస్సాం అధ్యక్షుడు ముష్తాక్ అన్ఫర్ ఇలాగే భారీగా వెచ్చించి మరీ దుబాయ్ వెళ్లారు. అన్ఫర్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఫ్యామిలీతో కలిసి ఇటీవల దుబాయ్ నుంచి భారత్కు వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడ మహమ్మరి ఉధృతి పెరిగింది. దాంతో యూఏఈ సహా పలు గల్ఫ్ దేశాలు భారత విమానాలపై బ్యాన్ విధించాయి. అంతే.. అన్ఫర్ ఇక్కడే చిక్కుకుపోయారు.
ఇక యూఏఈ కేంద్రంగా కువైట్, ఒమన్, సౌదీ అరేబియా సహా ప్రపంచ వ్యాప్తంగా 32కి పైగా దేశాల్లో పెర్ఫ్యూమ్, ఓడ్(ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో వాయించే వీణలాంటి పరికరం) వ్యాపారం చేసే అన్ఫర్కు ఇప్పుడు బిజినెస్ పనుల నిమిత్తం వెంటనే దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. దాంతో చేసేదేమి లేక భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గౌహతి నుంచి ఓ ప్రైవేట్ విమానంలో దుబాయ్ వెళ్లారు. దీనికోసం ఆయన ఏకంగా రూ.55లక్షలు వెచ్చించారని స్థానిక మీడియా పేర్కొంది. ఇలా తప్పనిపరిస్థితుల్లో స్వదేశానికి వచ్చి, కరోనా కారణంగా ఇక్కడే చిక్కుకుపోయిన వారు ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపార పనుల కోసం భారీ మొత్తం ఖర్చు చేసి మరీ విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.