మాకు ఓటేయ్యకపోతే వాటర్, కరెంట్ కట్.. ఓటర్లకు మంత్రి బెదిరింపులు
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వాళ్లకి ఎలాంటి హామీలు ఇవ్వాలి వంటి అంశాలపై పార్టీలు దృష్టి పెడుతూ వుంటాయి. అయితే పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తపన్ దాస్గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వాళ్లకి ఎలాంటి హామీలు ఇవ్వాలి వంటి అంశాలపై పార్టీలు దృష్టి పెడుతూ వుంటాయి. అయితే పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తపన్ దాస్గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటెయ్యకపోతే విద్యుత్తు, మంచినీటి సరఫరాను కట్ చేస్తామంటూ బెదిరించారు. సప్తగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దాస్గుప్తా శనివారం హుగ్లీలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటేయని ఆయా ప్రాంతాల వారికి కరెంట్, తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. వాటి కోసం అప్పుడు బీజేపీనే అడగాలని దాస్గుప్తా ప్రజలకు సూచించారు.
ఇక తృణమూల్కే చెందిన ఓ ఎమ్మెల్యే సైతం గతంలో ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే హమీదుల్ రెహ్మాన్ దినాజ్పుర్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ తనకు ఓటేయని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామంటూ హెచ్చరికలు పంపారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ఆస్వాదించి.. పార్టీకి ఓటేయకుండా ద్రోహం చేస్తే వారు దేశద్రోహులేనంటూ మండిపడ్డారు . ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీకే ఓటేయాలని రెహ్మాన్ ఓటర్లకు సూచించారు.