ఆమెది పాకిస్తాన్.. అతనిది భారత్.. అన్లైన్ లో పరిచయమైన వీరు. క్రమంగా ప్రేమికులుగా మారారు.ఏదిఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో పాకిస్తాన్ యువతి.. వీసా లేకుండానే పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేసింది.
ప్రేమ చాలా విచిత్రమైనది. ప్రేమ కోసం.. ప్రేమించిన వారి కోసం.. ఏం చేయడానికైనా.. ఎంత దూరమైనా వెళ్లడానికైనా.. సిద్దపడుతారు ప్రేమికులు. అవసరమైతే.. ఎంతకైనా తెగిస్తారు. ఏదైనా చేస్తారు. అదేనేమో ప్రేమ గొప్పతనం. స్వచ్ఛమైన ప్రేమకు హద్దులు, ఎల్లలు ఉండదనీ కూడా అంటుంటారు. ఎవరి మీద ఎవరికీ ప్రేమ ఎలా పుడుతుందో.. కూడా చెప్పడం చాలా కష్టమే.. ఓ ప్రేమికురాలు కూడా దేశం కానీ దేశానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది.
తన ప్రేమను గెలిపించుకోవడం కోసం.. ముందు వెనుక ఆలోచించకుండా.. సరిహద్దులు దాటి వచ్చేసింది. ఈ ప్రేమ కథలో ప్రేమికుడిది భారత్ కాగా.. అమ్మాయిది పాకిస్థాన్. ఈ అపర ప్రేమికురాలు తన ప్రేమను గెలిపించుకోవడం కోసం.. అసలేం ఆలోచించకుండా.. వీసా లేకుండానే పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేసింది. ఆ యువకుడిని పెళ్లాడి, ఏది ఏమైనా అతడితోనే ఉండిపోయాలని ప్రయత్నించింది. కానీ.. అధికారులు ఆమెను తిప్పిపంపించారు.
వివరాల్లోకెళ్తే.. ఇఖ్రా జీవానీ ఓ పాకిస్థానీ అమ్మాయి. ఆమె వయసు 19 ఏళ్లు. ఆమె ఆన్ లైన్ లో లూడో గేమ్ ఆడుతుండగా.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ (26) అనే యువకుడు పరిచయం అయ్యాడు. తరుచు ఆన్లైన్ లో కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలా స్నేహితులైయ్యారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. కేవలం కొద్దిరోజుల్లోనే ములాయం, ఇఖ్రాలు పీకల లోతు ప్రేమలో పడ్డారు. ఎంతగా అంటే.. అతని కోసం యువతి సరిహద్దులు దాటి వచ్చేంతగా..
ఏదిఏమైనా సరే.. ఎలాగైనా తన ప్రియుడితో జీవించాలనుకున్న ఆ యువతి.. వీసా లేకపోవడంతో.. ప్రియుడు ములాయం సలహాపై పాకిస్తాన్ నుండి దుబాయ్కి విమానంలో ప్రయాణమైంది. ఈ క్రమంలో ఇక్రా తన ఇంట్లో ఉంచిన ఆభరణాలను అమ్మేసింది. ఆ తరువాత ఎలాగోలా.. ఆమె దుబాయ్ నుండి నేపాల్కు చేరుకుంది. అనంతరం.. ఇక్రా, ములాయం సింగ్లు ఖాట్మండులో వివాహం చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ఉన్నారు.
వాస్తవానికి ములాయం తనని సమీర్ అన్సారీ అనీ, తానో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ అని పరిచయం చేసుకున్నాడు. కాని అతని అసలు పేరు ములాయం సింగ్ అని, అతను సెక్యూరిటీ గార్డు అని యువతికి తరువాత తెలిసింది. అంత అయినా తరువాత చేసిందేమి లేకపోవడంతో అతడితో ఉండిపోవాలని భావించింది. ఈ క్రమంలో వారు నేపాల్ మీదుగా భారతదేశానికి చేరుకున్నారు. ఆ చివరిగా బెంగళూరుకు చేరుకుని జీవనం సాగిస్తున్నారు.
ఇఖ్రా తన పేరును రవా అని మార్చుకుంది. అయితే.. ఆ యువతి నిత్యం నమాజ్ చేస్తుండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. అలాగే.. యాదవ్ ఆమె కోసం నకిలీ ఆధార్ కార్డును తయారు చేయించాడు. తరువాత భారతీయ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేశాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో పోలీసులు ములాయం, ఇఖ్రాలను అరెస్ట్ చేశారు. ఇఖ్రా పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఆ పాకిస్థాన్ అమ్మాయిని పంజాబ్ లోని అమృత్ సర్ కు తరలించారు. అట్టారీ బోర్డర్ నుంచి ఆమెను పాక్ కు తిప్పి పంపారు.
