నో మోర్ పాలిటిక్స్.. ఇక ప్రజా జీవితమే.. : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వెంకయ్య నాయుడు: ప్రజా జీవితంలో మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తానని, రాజకీయాలు సహా పలు అంశాలపై ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు: తనకు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, ఇక రాజకీయ నాయకుడిని కానని స్పష్టం చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగిసిన తర్వాత వెంకయ్య నాయుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగనాలకు తెరపడింది.
భారత ఉపరాష్ట్ర పదవీ విరమణ చేసిన తర్వాత వెంకయ్యనాయుడు.. హైదరాబాద్ లో రాజకీయ, వ్యాపార, సినీ, కళ రంగాలలోని తన మిత్రులు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు, ఆయన జీవిత ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యంగ బద్దమైన ఉన్నత పదవిలో కొనసాగానని..అప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయని వెంకయ్య నాయుడు గుర్తు చేసారు. దీంతో వాటికి కట్టుబడి ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆ బంధనాలు లేవని పేర్కొన్న ఆయన.. తిరిగి ప్రజా జీవనంలో కొనసాగుతానని తెలిపారు. రాజకీయాల్లోకి మళ్లీ రానని చెబుతూనే తన అభిప్రాయాలను నిర్ముమోహమాటంగా వెల్లడిస్తానని తెలిపారు.
'గత ఐదేళ్లుగా రాజ్యాంగ పదవిలో ఉన్న నేను మళ్లీ రాజకీయాల్లోకి రావడం సరికాదు. కాబట్టి, రాజకీయ నాయకుడిగా నా కెరీర్ ముగిసింది” అని హైదరాబాద్లో తన స్నేహితులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్య అన్నారు. అయితే ప్రజా జీవితంలో మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తానని, రాజకీయాలు సహా పలు అంశాలపై ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాను అని చెప్పారు. “నేను ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు, నాకు అనేక పరిమితులు ఉన్నాయి.. నేను వాటికి కట్టుబడి ఉండవలసి వచ్చింది. నేను స్వేచ్ఛగా మాట్లాడలేను లేదా ప్రజలను స్వేచ్ఛగా కలవలేకపోయాను. ఇప్పుడు అలాంటి అడ్డంకులు లేవు'' అని అన్నారు.
ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొంటానని చెప్పిన వెంకయ్య, తన అనుభవాలను, ఎన్నో ఏళ్లుగా నేర్చుకున్న పలు విషయాలను యువత, మహిళలు, రైతులతో పంచుకుంటానని చెప్పారు. "ప్రతిఫలంగా, నేను వారితో మాట్లాడటం ద్వారా నా పరిజ్ఞానాన్ని నవీకరించడానికి కూడా ప్రయత్నిస్తాను" అని వెంకయ్య నాయుడు చెప్పారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి కోరారు. “కొందరు నాయకులు తమ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషించకుండా ఉంటే, వారు ప్రజాదరణలో ఇతరుల కంటే వెనుకబడి ఉండవచ్చనీ.. వార్తల్లో కనిపించరని అభిప్రాయపడటం దురదృష్టకరం. ఇది ప్రమాదకరమైన ధోరణి' అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశ గౌరవాన్ని నిలిపిన ప్రముఖ క్రీడాకారిణి కుమారి పీవీ సింధును హైదరాబాద్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సన్మానించడం ఆనందదాయకం. ఆమె జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని ట్వీట్ చేశారు.