కరోనా టీకాకు, గుండెపోటుకు సంబంధం ఉందా? ఆ సర్వే ఏం చెబుతుంది?
కోవిడ్-19 మహమ్మారిని నిరోధించడానికి భారతదేశంలో ఉపయోగించే కోవిషీల్డ్, కోవాక్సిన్, వ్యాక్సిన్కు గుండెపోటు ప్రమాదానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని వెల్లడైంది. ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్లో చేరిన రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో కరోనా సంక్షోభం తర్వాత గుండెపోటు కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలపై తలెత్తుతున్న సందేహం తొలగిపోయింది.
ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారి ఎలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడంతో ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టిన విషయం తెలిసింది. కానీ.. కరోనా విజృంభన, వ్యాక్సినేషన్ తరువాత గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగిపోయాయనే భావన అందరిలోనూ వచ్చింది. కరోనా టీకా ప్రభావం గుండెపోటు కేసులు పెరిగాయనే అనుమానాలు కూడా తీవ్రమయ్యాయి.
ఒకప్పుడు వయస్సు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చే ఈ గుండె జబ్బు కరోనా వ్యాక్సినేషన్ తర్వాత చాలా మంది యువత గుండెపోటు బారిన పడ్డారు. దీంతో కరోనా టీకా కారణంగానే గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో కేంద్రంతోపాటు పలు సంస్థలు కరోనా వ్యాక్సినేషన్ , గుండెపోటుకు ఏమైనా కారణముందా అనే కోణంలో పరిశోధనలు చేస్తోంది. తాజాగా ఓ సర్వే వివరాలు వెల్లడయ్యాయి.
భారతదేశంలో ఉపయోగించే కోవిడ్-19 వ్యాక్సిన్లకు (కోవిషీల్డ్,కోవాక్సిన్) గుండెపోటు వచ్చే ప్రమాదానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని సర్వేలో వెల్లడయ్యాయి. పీఎల్ఓఎస్ వన్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనంలో భారత టీకాల రక్షిత ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. PLOS జర్నల్లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం గుండెపోటు కారణంగా మరణంపై కోవిడ్-19 టీకా ప్రభావాన్ని అంచనా వేసింది.
ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2022 మధ్య ఢిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రిలో చేరిన 1,578 మంది నుండి సేకరించిన డేటాను ఈ అధ్యయనం ఉపయోగించింది. వీరిలో సుమారు 1,086 (68.8 శాతం) మంది కోవిడ్-19 టీకాను పొందగా, 492 (31.2 శాతం) మంది వ్యాక్సిన్ను పొందలేదు. వ్యాక్సినేషన వేసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా.. 39 (నాలుగు శాతం) మందికి ఒక డోస్ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.
గోవింద్ వల్లభ్ పంత్ హాస్పిటల్తో అనుబంధంగా ఉన్న,అధ్యయనానికి నాయకత్వం వహించిన మోహిత్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. “భారతదేశంలో వ్యాక్సిన్ల వాడకం సురక్షితమైనదని మా అధ్యయనంలో తేలింది. టీకాకు భారతదేశంలో గుండెపోటుతో సంబంధం లేదు. వాస్తవానికి టీకాలు వేసిన వ్యక్తులు గుండెపోటుతో చనిపోయే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడయింద"ని పేర్కొన్నారు. భారతదేశం వంటి జనసాంద్రత కలిగిన దేశంలో వ్యాక్సిన్ల వల్ల ఏవైనా దుష్ప్రభావాలు విపత్కర ప్రభావాన్ని చూపుతాయని అధ్యయన రచయితలు తెలిపారు.