అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్నాథ్ సంచలనం
అణ్వాయుధాల ప్రయోగాల విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ:అణ్వాయుధాలను మొట్ట మొదటగా ఉపయోగించకూడదనే తమ విధానమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో ఈ నిర్ణయంలో మార్పు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
శుక్రవారం నాడు పోఖ్రాన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్టాడారు. తమకు తాముగా అణ్వాయుధాలను మొదటగా ఉపయోగించకూడదనే తమ నిబంధనలో మార్పు లేదన్నారు. అయితే భవిష్యత్తులో ఈ విధానంలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండొచ్చన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్దానికి తాము సిద్దమనే రీతిలో పాక్ ప్రకటనలు చేస్తోంది. లడఖ్ కు సమీపంలోని స్కర్ట్ ఎయిర్ బేస్ కు పాక్ యుద్ద సామాగ్రిని తరలిస్తుందని నిఘా వర్గాలు తెలిపాయి.
ఈ తరుణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పాక్ ను ఉద్దేశించి చేసినట్టుగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.