బీహార్ మాజీసీఎం ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తన పెరోల్‌ను పొడిగించాలని పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్‌ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టు 30లోపు జైలుకు రావాలని ఆదేశించింది. 

జార్ఖండ్: బీహార్ మాజీసీఎం ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తన పెరోల్‌ను పొడిగించాలని పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్‌ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టు 30లోపు జైలుకు రావాలని ఆదేశించింది. దాణా కుంభకోణంలో అప్పటి బిహార్‌ సీఎంగా ఉన్న లాలూ నిందితుడిగా తేలడంతో రాంచీలోని సీబీఐ కోర్టు జైలుశిక్ష విధించింది. 

జైలులో శిక్ష అనుభవిస్తుండగా అనారోగ్యానికి గురవ్వడంతో కోర్టు మే 11న పెరోల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ ముంబాయిలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవలే ఆయన పెరోల్ ను ఆగష్టు 10 నుంచి 20కి పొడిగించింది.

మే నెల నుంచి అనారోగ్య కారణాల రీత్యా లాలూ పెరోల్‌ను పొడిగిస్తూ వచ్చారు. ఆరోగ్యం మెరుగు పడలేదని పెరోల్‌ను మరింత పొడిగించాలని లాలూ తరపు న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. అవసరమైన వెంటనే లాలూకు చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

అవసరమైతే రాంచీలో రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని సూచించింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తొలిసారి మే 11న ఆరువారాల పాటు ప్రొవిజినల్‌ బెయిల్‌ను మంజూరు చేసింది జార్ఖండ్ హైకోర్టు.