Asianet News TeluguAsianet News Telugu

సామాజిక మాధ్యమాల్లో సాయం కోరితే చర్యలా? అది కోర్టు ధిక్కారమే.. : సుప్రీంకోర్ట్ హెచ్చరిక

కరోనా మహమ్మారి విలయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇతర విధాలుగా సహాయం కోరే వారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారం అణచిపెట్టవద్దని కోరింది.

No clampdown on the information : SC warns states, centre - bsb
Author
Hyderabad, First Published Apr 30, 2021, 3:38 PM IST

కరోనా మహమ్మారి విలయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇతర విధాలుగా సహాయం కోరే వారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారం అణచిపెట్టవద్దని కోరింది.

మనదేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70 ఏళ్ల నాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ విమర్శించడానికి కాదు అని వివరించింది. కేవలం ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా, మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానం వంటి వాటికి సంబంధించిన సమస్యలపై ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు స్వీయ విచారణకు చేపట్టిన సంగతి తెలిసిందే. 

శుక్రవారం జరిగిన విచారణలో కొవిడ్-19 సోకినా ఆరోగ్య సేవల సిబ్బంది కి చికిత్స చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సాధారణ పౌరుడిగా, న్యాయమూర్తిగా ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని జస్టిస్ చంద్ర చూడ్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటే, ఆ సమాచారం తొక్కి పెట్టాలని తాము కోరుకోవడం లేదన్నారు.

ఆసుపత్రిలో పడకను కానీ, ఆక్సిజన్ను కాని కోరిన వ్యక్తులను హింసించరాదని అటువంటి వారిని హింసించడం కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం మానవాళి సంక్షోభంలో ఉందన్నారు. వైద్యులు, ఆరోగ్య సేవల కార్యకర్తలకు సైతం ఆస్పత్రిలో పడకలు అందుబాటులో ఉండటం లేదన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వ్యాక్సిన్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలన్నారు. వ్యాక్సిన్ ల తయారీ కోసం ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సహాయపడటం చాలా ముఖ్యమని చెప్పారు.

సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలను చెప్పుకున్నపుడు వారు చెప్తున్న మాటలు పూర్తిగా తప్పు అని ముందుగానే భావించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా విజృంభణను కట్టడి చేయడం కోసం ఆస్పత్రులు, దేవాలయాలు, మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలను అందుబాటులో ఉంచాలని తెలిపింది.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలను ప్రస్తావిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆస్పత్రులకు వేర్వేరు ధరలు ఎందుకు నిర్ణయించారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నూటికి నూరు శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు ఉండడంలో ఔచిత్యం ఏమిటి? అని అడిగింది 50% వ్యాక్సిన్ డోసులను వదిలి పెడుతున్నామని రాష్ట్రాలు కొనుక్కోవాలని కేంద్రం చెప్పిందని ఇది సమానత్వాన్ని ప్రోత్సహిస్తుందా? అని ప్రశ్నించింది. ధరల విషయం చాలా తీవ్రమైనది అని పేర్కొంది.

50 శాతం డోసులు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, వాటిని ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం, 45 ఏళ్ళ వయసు పైబడిన వారి కోసం వాడతారని, మిగిలిన డోసులను 18 ఏళ్ల వయసు పైబడిన వారి కోసం ఉపయోగిస్తారని చెబుతున్నారని పేర్కొంది. దేశంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు 59 కోట్ల మంది ఉన్నారని, వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి పేదలు అణగారిన వర్గాల వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని నిలదీసింది.

తాతకు ఆక్సీజన్ కావాలంటూ ట్వీట్... అరెస్ట్ చేసిన పోలీసులు.. !...

ఇలాంటి ప్రైవేట్ రంగ విధానం ఉండకూడదని పేర్కొంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం అమలు చేస్తున్న జాతీయ రోగ నిరోధక విధానాన్ని అమలు చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వాదనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపుల గురించి వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

లాక్‌డౌన్ తరహా ఆంక్షలు, చర్యల గురించి వివరించాలని కోరింది. నిరక్షరాస్యులు వ్యాక్సినేషన్ కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని, వారికి ఇంటర్నెట్ సౌకర్యం ఉందా? అని ప్రశ్నించింది.. స్మశానవాటికలో సిబ్బందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారా? పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92 ను అమలు చేస్తున్నారా? అత్యవసర పరిస్థితుల్లో లైసెన్సుల జారీ విధానం ఏమిటి? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

Follow Us:
Download App:
  • android
  • ios