కేసు పెండింగ్ ఎఫెక్ట్: కర్ణాటక ఉప ఎన్నికలకు బ్రేక్
కర్ణాటక రాష్ట్రంలో ఉఫ ఎన్నికల విషయంలో ఈసీ తన నిర్ణయాన్ని మార్చుకొంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకొంటామని ఈసీ ప్రకటించింది.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు గురువారం నాడు తెలిపింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి బలపరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ ఫిర్యాదు మేరకు 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఆరేళ్ల పాటు అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదు.అయితే అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ తరుణంలో తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తామని గురువారం నాడు సుప్రీం కోర్టుకు ఈసీ తెలిపింది. మరో వైపు తదుపరి విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.