రేపు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్లు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఆర్జేడీ- లెఫ్ట్- కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పడనుంది.
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (nitish kumar) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్లో ఆర్జేడీ- లెఫ్ట్- కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం రేపు ఏర్పడనుంది. ఆర్జేడీ (rjd) నేత తేజస్వీ యాదవ్ (tejashwi yadav) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. తమకు ఏడు పార్టీల మద్ధతు వుందని నితీశ్ కుమార్ తెలిపారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు మొత్తంగా 164 మంది సభ్యుల మద్ధతు వుందని ఆయన చెప్పారు. వారంతా తమకు మద్ధతుగా లేఖపై సంతకాలు చేశారని నితీశ్ తెలిపారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తెగదింపులు చేసుకున్నాయని.. పార్టీ సభ్యులందరి ఆమోదం మేరకు తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయాలని పార్టీ నేతలే విజ్ఞప్తి చేశారని నితీశ్ చెప్పారు.
అటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి భాగస్వామ్య పార్టీలేవి లేవన్నారు. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీలను నాశనం చేస్తుందనే విషయాన్ని చరిత్రే చెబుతోందని తేజస్వీ పేర్కొన్నారు. పంజాబ్, మహారాష్ట్రలలో జరిగిందేమిటో మనం చూశామని .. భాగస్వామ్య పార్టీలను చీల్చి బీజేపీ బీజేపీ పగ్గాలు చేపట్టాలనుకుందని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తామని జేపీ నడ్డా చెబుతుంటారని.. ప్రజల్ని భయపెట్టడం, కొనుగోలు చేయడమే బీజేపీకి తెలుసని విరుచుకుపడ్డారు. దేశంలోనే బీజేపీ అజెండా అమలు కాకూడదనే తామంతా కోరుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పటికీ, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) భారతీయ జనతా పార్టీ (BJP)తోనే ఉంటుందని మంగళవారం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ వార్తా సంస్థ ANIతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేడీ(యూ), ఆర్జేడీలు ఎక్కువ కాలం కలిసి ఉండలేవని అన్నారు.
సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తరువాత పశుపతి పరాస్ ‘టౌమ్స్ నౌ’తో మాట్లాడారు. నితీష్ కుమార్ నిర్ణయం బీహార్కు అనుకూలంగా లేదని అన్నారు. ఎన్డీఏ కూటమిలో ఈ బ్రేక్ రాష్ట్ర అభివృద్ధికి అవరోధమని తెలిపారు. ఎన్డీయే నుంచి విడిపోవడానికి గల కారణం నితీష్ కుమార్కు మాత్రమే తెలుసని, బీజేపీకి వ్యతిరేకంగా కేకలు వేయడం బూటకమని పరాస్ అన్నారు.
RLJP నాయకుడు, లోక్ సభ ఎంపీ ప్రిన్స్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘ మేము ఇతర పార్టీల నిర్ణయాలపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ మేము ఎన్డీఏతో ఉన్నాం. మాకు (బీజేపీ) గౌరవం ఇవ్వడం లేదని మేము భావించడం లేదు. దాని గురించి (జేడీయూ) మాత్రమే చెప్పగలరు. ’’ అని ఆయన అన్నారు. బీహార్లో అధికార బీజేపీ-జేడీ(యూ) కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తోందన్న ఊహాగానాలకు తెరదించుతూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు ఈ వ్యాఖ్యలు వచ్చాయి.