ఆయన బలమైన అభ్యర్ధే.. నితీశ్ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని సమర్ధించిన తేజస్వీ యాదవ్
2024లో ప్రధాని అభ్యర్ధిగా నితీశ్ కుమార్ అభ్యర్ధిత్వాన్ని సమర్ధించారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. ఐదు దశాబ్ధాల రాజకీయ అనుభవంలో జయప్రకాశ్ నారాయణ్, రిజర్వేషన్ ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు
బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పి తన పాత మిత్రుడు ఆర్జేడీతో జట్టుకట్టారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. బీజేపీ తన ప్రభుత్వంలో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని భావించిన ఆయన తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి .. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. దీనిని నితీశ్ ప్రత్యర్ధులు సైతం మెచ్చుకుంటున్నారు. ఇక రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపుడుతున్న వేళ.. మోడీకి సరైన ప్రత్యర్ధి ఎవరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాహుల్ గాంధీని పట్టించుకోని విపక్ష నేతలు నితీశ్లో ప్రధాని కాగల అర్హతలు వున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
తాజాగా ఈ లిస్ట్లోకి చేరారు ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. బీహార్లోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం విపక్షాల ఐక్యతకు చిహ్నమన్నారు. విపక్షాలు తమ ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా ఎవరినైనా పరిశీలించాల్సి వచ్చినప్పుడు నితీశ్ సరిగ్గా సరిపోతారని తేజస్వి అన్నారు. ఐదు దశాబ్ధాల రాజకీయ అనుభవంలో జయప్రకాశ్ నారాయణ్, రిజర్వేషన్ ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు. 37 ఏళ్ల పాటు ఎంపీగా, సీఎంగా మంచి పరిపాలనా అనుభవం వుందని తేజస్వి ప్రశంసించారు.
Also Read:RCP Singh: ఏడు జన్మలెత్తిన నితీష్ కుమార్ ప్రధాని కాలేదు
ఇకపోతే.. బీహార్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. మొత్తం 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 16 మంది ఆర్జేడీకి చెందిన వారే ఉన్నారు. అయితే తాజాగా ఆ పార్టీ మంత్రులకు తేజస్వీ యాదవ్ పలు సూచనలు చేశారు. కొత్త మంత్రులు ఎవరూ కొత్త కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేయవద్దని అన్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు లేదా పెద్దవారు ఎవరైనా తమ పాదాలను తాకడానికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు. నమస్కారం, నమస్తే, అదాబ్ సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
పేదలు, నిరుపేదలతో మంత్రులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. వారి కులం లేదా మతం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని తెలిపారు. ప్రతీ ఒక్కరి పట్ల సున్నితంగా, మర్యాదగా ఉండాలని, వారితో సానుకూలంగా ప్రవర్తించాలని వారిని కోరారు. పువ్వులు, బొకేలను బహుమతులుగా ఇవ్వడానికి బదులుగా పుస్తకాలు, పెన్నుల మార్పిడిని ప్రోత్సహించాలని మంత్రులను కోరారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖాపరమైన పనుల్లో నిజాయితీ, పారదర్శకతను పెంపొందించాలని తేజస్వీ యాదవ్ కోరారు. మంత్రులు తమ పని ప్రణాళికలు, అభివృద్ధి పనులను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. దీని వల్ల మంత్రులు తీసుకునే చొరవ ప్రజలకు సానుకూల సమాచారాన్ని పంపిస్తుందని అన్నారు.