మరోసారి వార్తల్లోకి నిత్యానంద.. వివాదాస్పద ట్వీట్..!
మదురై శైవ మఠానికి కొన్ని దశాబ్దాల పాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారం శివైక్యం పొందిన విషయం తెలిసిందే.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన వివాదాస్పద ట్వీట్ చేయడం గమనార్హం. మదురైలోని ప్రసిద్ధి చెందిన శైవ మఠానికి తాను బాధ్యతలు స్వీకరించినట్లు ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
కైలాస దేశం నుంచే ఆన్లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే తన పేరు ‘జగద్గురు మహాసన్నిధానం శ్రీలశ్రీ భగవాన్ నిత్యానంద పరమశివజ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామి’గా మార్చుకున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించడం చర్చకు దారితీసింది.
మదురై శైవ మఠానికి కొన్ని దశాబ్దాల పాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారం శివైక్యం పొందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని మహాసమాధి చేసినానంతరం మఠంలో 500 కేజీలతో కూడిన అరుణ గిరినాధర్ పాలరాతి శిల్పాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అలాగే 293వ ఆధీనంగా హరిహర జ్ఞాన సంబంధం దేశీయ పరమాచార్య బాధ్యతలు చేపట్టారు.
మఠంలోని రహస్య గదిలోని ఆభరణాలు, విలువైన వజ్రాలు , రాష్ట్రవ్యాప్తంగా మదురై మఠానికి ఉన్న ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ధర్మపురం ఆధీనం సమక్షంలో 293వ ఆధీనానికి అప్పగించారు. అయితే మఠాన్ని కైవశం చేసుకునేందుకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.