ఉదయ్ పూర్లో టైలర్ కన్హయ్యలాల్ మర్డర్: కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ కు చెందిన టైలర్ హత్య కేసులో ఎన్ఐఏ విచారణను ప్రారంభించింది. కన్హయ్య లాల్ హత్య కేసుపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించింది కేంద్ర హోం మంత్రిత్వశాఖ.
న్యూఢిల్లీ: Rajasthan రాష్ట్రంలోని Udaipur కు చెందిన Tailor కన్హయ్యలాల్ తేలి హత్యకు సంబంధించి NIA బుధవారం నాడు కేసు నమోదు చేసింది.BJP నుండి Suspension కు గురైన నుపూర్ శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోస్టుకు టైలర్ Kanhaiya Lal,మద్దతు పలికారు. కన్హయ్యలాల్ ను ఇద్దరు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ఎన్ఐఏకి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది.
ఈ ఘటన వెనుక అంతర్జాయతీయ లింకులున్నాయా అనే విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నట్టుగా కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shah కార్యాలయం బుధవారం నాడు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది.కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును ప్రారంభించినట్టుగా ఎన్ఐఏ తెలిపింది.
ఉగ్రవాద నిరోధక చట్ట విరుద్ద కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఎన్ఐఏ బృందాలు ఇప్పటికే ఉదయ్ పూర్ లో తమ దర్యాప్తును ప్రారంభించాయి. ఈ ఘటనకు సంబంధించి దేశంలో ప్రజల్లో భయాందోళనలు కల్గించేందుకు గాను నిందితులు సోషల్ మీడియాలో వీడియోను కూడా పోస్టు చేశారని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉదయ్ పూర్ లోని ధన్మండి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించి తొలుత కేసు నమోదైంది. నిందితులపై ఐపీసీ 452, 302, 153ఏ, 153 బీ, 295 ఏ, 34 సెక్షన్లతో పాటు ఉపా చట్టం 1967 సెక్షన్లు 16,18, 20 కింద ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు.
నిందితులిద్దరూ పదునైన ఆయుధాలతో టైలర్ కన్హయ్యను గాయపర్చారని ఎన్ఐఏ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు.రాజస్థాన్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయమై సిట్ బృందంతో కలిసి ఎన్ఐఏ అధికారులు విచారణను ప్రారంభించారు. ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యలాల్ హత్య తర్వాత చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.