వివాహం జరిగిన 10 రోజులకే నవదంపతుల మృతి.. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
జీవితంపై ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంట.. పెళ్లి జరిగిన 10 రోజులకే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
బెంగళూరు: ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంట.. పెళ్లి జరిగిన 10 రోజులకే అనంతలోకాలకు వెళ్లిపోయింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా.. వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. మృతిచెందిన నవదంపతులను మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. వివరాలు.. మహారాష్ట్రకు చెందిన ఇంద్రజిత్ మోహన్ దమ్మనాగి, కళ్యాణి ఇంద్రజిత్ దమ్మనాగి 10 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా బాదామిలో బనశంకరి ఆలయ దర్శనం కోసం నవ దంపతులిద్దరూ వచ్చారు. దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. బెలగావి జిల్లా ముదలగి తాలూకా సమీపంలోని హల్లూరు గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దంపతులు కారులో వెళ్తుండగా ట్యాంకర్ ఢీకొట్టింది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు.