శివసేన ఎంపీ బెదిరించాడు: స్పీకర్ కు ఎంపీ నవనీత్ కౌర్ ఫిర్యాదు
: పార్లమెంట్ లో సచిన్ వాజే ఇష్యూను లేవనెత్తినందుకు తనను శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో సచిన్ వాజే ఇష్యూను లేవనెత్తినందుకు తనను శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోపించారు.
సోమవారం నాడు పార్లమెంట్ లో సచిన్ వాజే అంశాన్ని నవనీత్ కౌర్ లేవనెత్తారు. హీరేన్ హత్య కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత లాబీల్లో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో చూస్తానని చెప్పాడన్నారు. అంతేకాదు తనను జైల్లో వేస్తానని కూడ బెదిరింపులకు దిగాడని ఆమె లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.
అంతకు ముందు కూడ తనకు శివసేన నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆమె స్పీకర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.
తనను బెదిరించిన ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ లేఖ కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి, న్యూఢిల్లీలోని పోలీస్ ఉన్నతాధికారులకు పంపారు.
సచిన్ వాజే ఇష్యూతో పాటు హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్ ను కుదిపేస్తున్నాయి.