విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి: మోడీ
రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు.
సోమవారం నాడు వారణాసిలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామన్నారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చినా పాత విధానాలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న రైతులు కూడా భవిష్యత్తులో దీని వల్ల లబ్దిపొందుతారన్నారు.
కేంద్ర ప్రభుత్వం రహదారులపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు , సంస్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని ఆయన చెప్పారు.
స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా రైతులకు 1.5 రెట్లు ఎక్కువ ఎంఎస్పీ ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ వాగ్ధానం కాగితంపై మాత్రమే నెరవేరడమే కాదు.. రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతోందని ఆయన వివరించారు.
రైతుల ప్రయోజనం కోసం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినట్టుగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ కొత్త చట్టాల ప్రయోజనాలను రైతులు అనుభవిస్తారని ఆయన వివరించారు.