New Delhi: బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీలకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేయడానికి బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం స్పందిస్తూ.. బీబీసీ ఆఫీసులపై జరుగుతున్న సోదాలను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, 19 గంటలుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయని తెలిపింది.
IT raids on BBC offices: పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ మంగళవారం నాడు ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ సోదాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగాయి. బీబీసీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని విడుదల చేసిన కొన్ని వారాల తర్వాత ఈ సోదాలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రతిపక్ష పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి ఈ అంశం కారణంగా మారింది. ఈ క్రమంలోనే బీబీసీ, బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఈ సోదాలపై స్పదించాయి.
ప్రతిపక్షాలు బీబీసీపై సోదాలను ఖండించగా, బీబీసీ భారత్ కు వ్యతిరేకంగా విషపూరిత రిపోర్టింగ్ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఈ వాగ్వాదం మధ్య బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బీబీసీకి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. తన లాభాల్లో గణనీయమైన భాగాన్ని మళ్లించిన ఆరోపణల గురించి ఓ అధికారి ప్రస్తావించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు..
బీబీసీ ఇండియా కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఐటీ అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి. ప్రాంగణంలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉద్యోగుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేశారు. ఢిల్లీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని ఇళ్లకు వెళ్లాలని ఆదేశించారు. మధ్యాహ్నం షిఫ్టులో పనిచేసే వారిని ఇంటి నుంచే పనిచేయాలని కోరారు. డొల్ల కంపెనీ, నిధుల బదిలీ, విదేశీ నిధుల బదిలీ సహా వ్యవస్థలకు సంబంధించిన నాలుగు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ అధికారులు శోధించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు ఇండియా టుడే నివేదించింది. సర్వే కొనసాగుతున్న సమయంలో పలువురు ఉద్యోగులు బీబీసీ ఇండియా కార్యాలయంలో ఉన్నారు.
దేశ చట్టాలకు ఎవరూ అతీతులు కాదు..
బీబీసీ ఆఫీసుల్లో సోదాలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దేశ చట్టానికి ఎవరూ అతీతులు కాలేరనీ, ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో నిర్వహించిన సర్వే వివరాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడిస్తున్నదని తెలిపారు. కొన్ని అవకతవకలు జరిగే ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుందన్నారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేస్తారని లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమాచారం పంచుకుంటారని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
బ్రిటీష్ ప్రభుత్వం స్పందిస్తూ..
భారత్ లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను సర్వేలను బ్రిటన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని యూకే ప్రభుత్వ వర్గాలు మంగళవారం పీటీఐకి తెలిపాయి. ఈ సర్వేపై బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేదు, కానీ భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో నిర్వహించిన పన్ను సర్వేలను తాము పర్యవేక్షిస్తున్నామని బ్రిటిష్ వర్గాలు తెలిపాయి.
ఈ సర్వేపై బీబీసీ వ్యాఖ్యలు..
ఢిల్లీ, ముంబయిలోని తమ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉన్నారని బీబీసీ తెలిపింది. వారికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఆదాయపు పన్ను సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలను బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) వెల్లడించలేదు. తాము పూర్తిగా సహకరిస్తున్నామని బీబీసీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పరిస్థితి పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
