కరోనా విశ్వరూపం: దేశ వ్యాప్తంగా నీట్-పీజీ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా
దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో ఆఫ్లైన్లో ఈ పరీక్షలు నిర్వహించనుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపారు.
యువ వైద్య విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ పరీక్షకు కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని హర్షవర్థన్ తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో వైద్యుల బృందం గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
Also Read:ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ ఒకే రోజు 2 లక్షల కేసుల నమోదు
కాగా ఇప్పటికే కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకొంది. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకొన్నారు.