డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్లకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఛత్తీస్‌గడ్‌లో వారు ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు.  

రాయ్‌పూర్: నిరసనలు చేస్తున్న రెజ్లర్లకు నిషేధిత మావోయిస్టు పార్టీ మద్దతు తెలిపింది. మల్లయోధులకు మద్దతు ఇస్తున్నట్టు నక్సలైట్లు ఓ బ్యానర్‌లో ప్రకటించారు. డబ్ల్యూఎఫఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు.

ఛత్తీస్‌గడ్‌లో కాంకేడ్ జిల్లాలో జనక్ పూర్ నుంచి ఛోటేబేథియాల మధ్య గల రోడ్డు పై ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు.  ఆ నక్సలైట్లు బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్ పైనా విమర్శలు సంధించారు. ఈ క్యాంపెయిన్ కేవలం ఒక హిపోక్రసీ అని ఆరోపించారు. బందే పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే పార్తాపూర్ ఏరియా కమిటీ ఈ బ్యానర్‌ను నాటినట్టు తెలిసింది.

జంతర్ మంతర్ వద్ద ఈ రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు నూతన పార్లమెంటు వైపునకు వెళ్లకుండా అడ్డుకున్నప్పటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బలవంతంగా వారిని రోడ్డుపై అడ్డుకుని లాక్కెళ్లి పోలీసు వాహనాలను ఎక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసుకున్న వారి నిరసన వేదికను పోలీసులు తొలగించారు. గతవారం వీరు.. ప్రభుత్వానికి ఐదు రోజుల గడువుతో అల్టిమేటం విధించారు. ఈ ఐదు రోజుల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై యాక్షన్ తీసుకోవాలని అల్టిమేటం పెట్టారు. 

Also Read: గంగా నదిలో పతకాలు కలపాలనే నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే?

రెజ్లర్ల నిరసనలో సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్, బజ్రంగ్ పూనియాలు ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పోరాటం సాగుతున్నది.

మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో సహా ఇతర ఆరోపణల కింద బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదయ్యాయి. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించాలని, అరెస్టు చేసి దర్యాప్తు చేయాలని నిరసనలు చేస్తున్న రెజ్లర్లు డిమాండ్ చేశారు.