రన్వేపైకి దూసుకొచ్చిన మరో ఫ్లైట్.. ఏటీసీ అప్రమత్తం, ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం రన్ వేపై ల్యాండ్ అవుతుండగా మరో ఫ్లైట్ దూసుకొచ్చింది.
గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవాకు బయల్దేరింది ఇండిగో ఫ్లైట్. ల్యాండింగ్ సమయంలో రన్వేపైకి దూసుకొచ్చింది మరో విమానం. రన్ వేపై ల్యాండైన 15 సెకన్లకు మళ్లీ టేకాఫ్ అయ్యింది ఇండిగో ఫ్లైట్. అలా గాల్లోనే 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో గోవాలో సేఫ్గా ల్యాండైంది విమానం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. గత నెలలో ఇండిగో విమానంలో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. టేకాఫ్కు ముందు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వెంటనే ప్రయాణీకులను , సిబ్బందిని విమానం నుంచి కిందకు దింపేశారు. వారందరినీ సురక్షతంగా టెర్మినల్ భవానానికి తరలించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.
Also Read:ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. టేకాఫ్ నిలిపివేత.. తప్పిన ముప్పు.. అందరూ సేఫ్
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఢిల్లీ నుండి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం (6E-2131)లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. విమానంలో కూర్చున్న ప్రయాణికులు కిటికీలోంచి ఇంజన్ మంటలు రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలోనే విమానాన్ని నిలిపివేశారు. విమానం టేకాఫ్ కాలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న 6E2131 విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. కాసేపటికే పైలట్ టేకాఫ్ను నిలిపివేశాడు. ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్లైన్స్ తెలిపింది. ప్రయాణీకుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఇండిగో ప్రకటించింది.
గత కొన్ని నెలలుగా..అనేక విమానాలలో సాంకేతిక లోపాలు తలెత్తున్నాయి. పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్లు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా స్పైస్జెట్ విమానాల్లో గరిష్ఠ సంఖ్యలో అవాంతరాలు తలెత్తాయి.ఇండిగో,ఎయిరిండియా విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులో ప్రమాదం గల కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు.