PM Security Breach: ప్రధాని భద్రతా వైఫల్యంపై నవీన్ పట్నాయక్ రియాక్ట్ .. ఏమన్నడంటే ?
PM Security Breach: పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి భద్రతా వైఫల్యంపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, మరోవైపు సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. రాజ్యాంగ బద్దమైన పదవి ఉన్న ప్రధానికి మన బాధ్యతగా పేర్కొన్నారు.
PM Security Breach:పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. ప్రధాని కాన్వాయ్ మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్పై నిలిచిపోయారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ అయ్యింది. ఈ నిర్లక్ష్యంపై తగిన వివరణ ఇవ్వాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా నిర్లక్ష్యం చేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, జవాబుదారీతనం పరిష్కరించబడుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
మరోవైపు.. ఈ ఘటన సుప్రీం కోర్టుకు కూడా సీరియస్ అయ్యింది. భద్రతా వైఫల్యంపై అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలయ్యింది. పంజాబ్ పాలకులు దురుద్దేశంతోనే భద్రతా వైఫల్యం సృష్టించారని, అదే సమయంలో దేశ భద్రతకే ఇది తీవ్రమైన విఘాతమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కాన్వాయ్లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉండాలని, కానీ వారిద్దరూ లేరని అన్నారు. భద్రతా ఏర్పాట్లపై ఆధారాలను భఠిండా జిల్లా జడ్జి వద్ద ఉంచేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కేసు విచారణ తక్షణమే చేపట్టాలని, ఈ ఘటనకు కారణమెవరో తేల్చాలని అత్యున్నతస్థాయి విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. పంజాబ్లో భద్రతా ఉల్లంఘనలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. సిఎం పట్నాయక్ ట్విటర్ వేదికగా.. "భారత ప్రధాని పదవి అనేది రాజ్యాంగ బద్ధమైనది. ఆయనకు పూర్తిస్థాయి భద్రతను అందించడం, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడడం ప్రతి ప్రభుత్వ విధి. ఇది విరుద్ధమైన చర్య. ఏది ఏమైనా.. ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు ..’ అని ట్విట్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఉన్నత సభ్యలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్ ప్రభుత్వం. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఛన్నీ ఆదేశించారు . ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మకు చోటు కల్పించింది.
మరోవైపు ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. అధికార బీజేపీ పార్టీ సహా విపక్షాలు పంజాబ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లో బుధవారం పర్యటించిన సమయంలో జరిగిన భద్రతాపరమైన లోపాలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరా తీసి ఆందోళన వ్యక్తం చేశారు.