లోక్ సభలో  ఇవాళ  అవిశ్వాసంపై చర్చను  కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గోగోయ్  ప్రారంభించారు.  

న్యూఢిల్లీ: మణిపూర్ కు న్యాయం కోసమే మోడీ సర్కార్ పై అవిశ్వాస నోటీసు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ ను చర్చను ప్రారంభించాలని మంగళవారంనాడు ఉదయం స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ చర్చను ప్రారంభించేందుకు లేచి నిలబడ్డారు. అయితే అదే సమయంలో సమయంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషీ జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

అవిశ్వాసంపై చర్చ ప్రారంభం కాకముందే బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ తరుణ్ గోగోయ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.అవిశ్వాసంలో గెలిచే సంఖ్యబలం లేదని తమకు తెలుసునన్నారు. మణిపూర్ ప్రజలకు న్యాయం చేసేందుకే అవిశ్వాసం తీసుకువచ్చామన్నారు.

హింస ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్యానికి విఘాతమేనని ఆయన చెప్పారు.మణిపూర్ అంశంపై ప్రధాని మౌనవ్రతం పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. మణిపూర్ తగలబడుతుంటే భారత్ తగలబడుతున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. శాంతికి ప్రధాని పిలుపిస్తే అది చాలా ప్రభావవంతంగా ఉండేదన్నారు. మణిపూర్ కు విపక్షాలు , రాహుల్ గాంధీ వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రధాని ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు.మణిపూర్ లో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందన్నారు. మణిపూర్ వైరల్ వీడియో ఎంత దారుణంగా ఉందో దేశమంతా చూసిందని గోగోయ్ గుర్తు చేశారు

.మణిపూర్ అత్యాచార బాధితురాలి భర్త కార్గిల్ సైనికుడన్నారు. దేశాన్ని కాపాడిన తాను తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయినట్టుగా సైనికుడు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని గోగోయ్ ప్రస్తావించారు.ముందు మణిపూర్ వెళ్లి చూసిన తర్వాత మాట్లాడాలని గోగోయ్ అధికార పార్టీకి సూచించారు.మణిపూర్ పై 30 సెకన్లపాటు మాట్లాడేందుకు మోడీకి 80 రోజులు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు.ఇంత జరిగినా మణిపూర్ సీఎంను ఎందుకు పదవి నుండి తప్పించలేదో చెప్పాలన్నారు.

ఇంటలిజెన్స్ వైఫల్యమే హింసకు కారణంగా ఆయన పేర్కొన్నారు.మణిపూర్ మంత్రి సోదరుడు డ్రగ్ మాఫియాను నడుపుతున్నాడన్నారు. డ్రగ్ మాఫియా నిందితుడిని సీఎం ఫోన్ తో విడుదల చేశారని గోగోయ్ ఆరోపించారు. మణిపూర్ వీడియోలు రాకుంటే మోడీ పెదవి విప్పేవారు కాదేమోనన్నారు.మణిపూర్ అంశంలో కేంద్రం, రాష్ట్రం వైఖరిని సుప్రీంకోర్టు తప్పు బట్టిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలను కేంద్రం ఎందుకు పట్టించుకోదని గోగోయ్ ప్రశ్నించారు.మణిపూర్ లో ఇంత జరుగుతుంటే భద్రతాదళాలు ఏం చేస్తున్నాయని ఆయన అడిగారు. అదానీ కంపెనీపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడ మోడీ నోరు విప్పలేదని ఆయన గుర్తు చేశారు.సాగు చట్టాలపై రైతుల ఆందోళన సమయంలో ప్రధాని మాట్లాడలేదన్నారు.పుల్వామా దాడుల సమయంలో మోడీ మౌనం పాటించారని ఆయన ఎద్దేవా చేశారు. రెజ్లర్ల ఆందోళన సమయంలో కూడ నోరు తెరవలేదన్నారు.తప్పులు ఒప్పుకునేందుకు ప్రధాని సిద్దంగా లేరని గోగోయ్ విమర్శించారు.

మణిపూర్ హింసకు తప్పంతా అసోం రైఫిల్స్ అంటున్నారన్నారు. అసోం రైఫిల్స్ పై మణిపూర్ పోలీసులు వేలేత్తి చూపుతున్నారని గోగోయ్ విమర్శించారు.2002లో గుజరాత్ లో అల్లర్లు జరిగిన ప్రాంతంలో అప్పటి ప్రధాని వాజ్ పేయ్ పర్యటించారని గోగోయ్ గుర్తు చేశారు. పార్టీల కంటే దేశం గొప్పదని నమ్మిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అస్సాం శాంతి ఒప్పంద సమయంలో కాంగ్రెస్ సర్కార్ రద్దు కావాలని రాజీవ్ గాంధీ కోరిన విషయాన్ని గోగోయ్ ప్రస్తావించారు.కరోనా ఓ వైపు దేశాన్ని కబళిస్తుంటే మోడీ బెంగాల్ లో ఓట్ల వేటకు వెళ్లారని ఆయన విమర్శలు చేశారు.