అన్ని మదర్సాలకు తాళాలు వేయాలన్నదే నా సంకల్పం - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
అస్సాంలో ఉన్న అన్ని మదర్సాలను మూసివేయడమే తన లక్ష్యం అని ఆ రాష్ట్ర సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ అన్నారు. తమ పిల్లలు చదువుకునేందుకు మదర్సాలు అవసరం లేదని, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని మదర్సాలకు తాళాలు వేయాలన్నదే తన సంకల్పమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పునరుద్ఘాటించారు. మదర్సాలకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు చదువుకోవడానికి మదర్సాలు అవసరం లేదని అన్నారు. తమ విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లేందుకు ఇష్టపడుతారని స్పష్టం చేశారు.
100 మార్కుల పేపర్లో 115 మార్కులు వచ్చాయి.. ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్స్పై దుమారం
కర్ణాటకలోని బెళగావిలో బీజేపీ చేపట్టిన 'విజయ్ సంకల్ప్ యాత్ర'లో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 600లకు పైగా మదర్సాలను మూసివేసినట్లు ప్రకటించారు. ‘మాకు మదర్సాలు వద్దు కాబట్టే మూసివేయాలని అనుకుంటున్నాం. మాకు స్కూళ్లు, యూనివర్సిటీలు కావాలి’ అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్, కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారు. భారత్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ మళ్లీ పని చేస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నేటి కొత్త మొఘల్ అని విమర్శించారు.
దక్షిణ భారతదేశం, ఈశాన్య ప్రాంతాలు ఔరంగజేబు పాలనలో ఎప్పుడూ లేవని శర్మ అన్నారు. కానీ కమ్యూనిస్ట్ చరిత్రకారులు భారతదేశం మొత్తం ఔరంగజేబు ఆధీనంలో ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు మనం కొత్త చరిత్ర రాయాలని చెప్పారు. ఔరంగజేబు మన ‘సనాతన్’ సంస్కృతిని నాశనం చేయలేడని తెలిపారు.
కాగా.. 2020 లో అస్సాం సీఎం శర్మ ఆ రాష్ట్రంలో ఓ వివాదాస్పద చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. అన్ని ప్రభుత్వ మదర్సాలను ‘సాధారణ విద్యను’ అందించే ‘సాధారణ పాఠశాలలు’గా మార్చాల్సి ఉంది. 2023 జనవరి నాటికి రాష్ట్రంలో 3,000 రిజిస్టర్డ్, రిజిస్టర్ కాని మదర్సాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా కర్ణాటక శాసనసభకు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. కొంత కాలం నుంచి కర్ణాకలో బీజేపీ సీనియర్ నేతలు యాత్రలు ప్రారంభించారు. నిరంతరం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమైన నాయకులు కర్ణాటకకు వచ్చి ప్రచారం చేస్తున్నారు.