వారిద్ద‌రూ వేర్వేరు హత్య కేసుల్లో దోషులు. ఒకే జైలు ఉన్న వీరి మధ్య తొలుత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కట్ చేస్తే..పెరోల్ మీద వచ్చి పెళ్లి చేసుకున్నారు.  

మీరు ఇంతకు ముందు చాలా ప్రేమకథలు విని ఉంటారు. చాలా ప్రేమ కథలు చదివి ఉంటారు. కానీ. మీరు ఇప్పుడూ చదువబోయే ప్రేమ కథ మాత్రం చాలా ప్రత్యేకం. మరో మాటలో చెప్పాలంటే.. ఆ కథే వేరే లెవల్.. ఈ ప్రేమ కథ చదివితే మాత్రం ..నిజంగా ప్రేమ ఎప్పుడు.. ఎవరిమీద ఎలా పుడుతుందో.. ఎవరికీ తెలియదని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వారిద్ద‌రూ వేర్వేరు హ‌త్య కేసుల్లో దోషులు.ఒకే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఒక‌రిపై మ‌రొక‌రు మన‌సు పారేసుకున్నారు. ఇలా మ‌న‌సులు క‌ల‌వ‌డంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెరోల్ మీద వచ్చి ఇరు కుటుంబాల స‌భ్యుల మ‌ధ్య వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

వివరాల్లోకెళ్తే.. అస్సాంలోని డోరాంగ్ జిల్లా రంగంగారోపత్తర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హసీం, పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని ఉచ్కరన్ బలిగాడికి చెందిన షాహాన‌ర ఖ‌తున్ ఇద్దరూ వేర్వేరు హత్య కేసులో దోషులు. వీరిద్ద‌రిని బెంగాల్‌లోని బ‌ర్ద‌మాన్ సెంట్ర‌ల్ క‌రెక్ష‌న‌ల్ హోమ్ లో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ జైలులోనే వారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా.. ప్రేమగా మారింది.

ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ లవ్ స్టోరీకి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో హ‌సీం, షాహాన‌ర పెరోల్‌పై విడుద‌ల‌య్యారు. వారు ముస్లిం చట్టం ప్రకారం తూర్పు బర్ధమాన్‌లోని మోంటేశ్వర్ బ్లాక్‌లో వివాహం చేసుకున్నారు. పెరోల్ ముగిసిన వెంటనే ఇద్దరినీ తిరిగి కరెక్షనల్ హోమ్‌కి వెళ్లనున్నారు. హ‌సీంకు 8 ఏండ్లు, షాహాన‌ర‌కు 6 ఏండ్ల జైలు శిక్ష విధించారు.