ముంబయిలో కుప్ప కూలిన భవనం.. 12కి చేరిన మృతులు
మూడంతస్తుల భవనంలోని రెండు అంతస్తులు.. పక్కనున్న ఒక అంతస్తు భవనంపై కుప్పకూలింది.
ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు భవనాలు కూలి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఓ భవనం కూలి దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరంది. కాగా.. ఈ ఘటన మరవకముందే .. తాజాగా.. మరో భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయిలోని మలాడ్ లో మల్వానీ ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని రెండు అంతస్తులు.. పక్కనున్న ఒక అంతస్తు భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో 8మంది చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని.. ఇటీవల తుఫానులో ఇది కొంత దెబ్బతిందని పోలీసులు తెలిపారు. భవన యజమాని గుత్తేదారుపై కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వలం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఈ విషాదంపై ప్రధానయంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50వేలు సాయం ప్రకటించారు. మృతుల్లో ఒకే కుటంబానికి చెందినవారు 9 మంది ఉండటం గమనార్హం.
కాగా.. గురువారం మరో భవనం కుప్పకూలగా.. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మొత్తంగా ఈ భారీ వర్షాలకు 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.