కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం.. బీజేపీలో మరో రచ్చ !
Mumbai: కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. బెల్గాం, కార్వార్, నిపానీ, భల్కి, బీదర్ నగరాలు, కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను మహారాష్ట్రలో చేర్చడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీర్మానంలో పేర్కొన్నారు.
Karnataka-Maharashtra Border Dispute: కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. బెల్గాం, కార్వార్, నిపానీ, భల్కి, బీదర్ నగరాలు, కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను మహారాష్ట్రలో చేర్చడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీర్మానంలో పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకతో వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారికి సంఘీభావం తెలుపుతూ మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ఆమోదించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఈ తీర్మానాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు . బెల్గాం, కార్వార్, నిపానీ, భాల్కీ, బీదర్ నగరాలు & కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో చేర్చేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలను సుప్రీంకోర్టులో నిర్వహిస్తామని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చదివి వినిపించారు. కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరాలనీ, సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠీ ప్రజల భద్రతకు హామీ ఇచ్చేలా ప్రభుత్వానికి అవగాహన కల్పించాలని కోరింది.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు సమస్య 1957 ఏర్పడింది. చాలా కాలం నుంచి ఉన్న ఈ వివాదం ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలకు కారణమైంది. సరిహద్దు ప్రాంతాల ప్రజల మధ్య వివాదాలకు కారణమైంది. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన తీర్మానాన్ని కర్ణాటక శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మహారాష్ట్రలోని శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ సిండే నాయకత్వంలోని గ్రూప్ తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, సరిహద్దు వివాదం ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసింది. రెండు రాష్ట్రాల బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
కర్నాటక సరిహద్దు వివాదంపై ఒకట్రెండు రోజుల్లో తీర్మానం చేస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో సభకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇక్కడ ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపింది. “మేము ఒక అంగుళం వదులుకోము.. పోరాటంలో ఒక అంగుళం కూడా వెనక్కి జరగము.. కర్నాటకలో మరాఠీ మాట్లాడే జనాభాకు న్యాయం జరిగేలా మేం చేయగలిగినదంతా చేస్తాం’’ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సోమవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏక్ నాథ్ షిండే ఈ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. కాగా, మహారాష్ట్ర తీర్మానంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య స్పందిస్తూ ఇది రాష్ట్రం రెచ్చగొట్టే చర్య తప్ప మరేమీ కాదని అన్నారు.
"సరిహద్దు వివాదాన్ని కర్ణాటక గురువారం ఖండించింది. కర్ణాటక భూమి, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కర్ణాటక ప్రజలు, సభ్యుల (అసెంబ్లీ) మనోభావాలు ఈ అంశంలో ఒకటి, అది ప్రభావితమైతే, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యాంగ-చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మనమందరం ఐక్యంగా కట్టుబడి ఉన్నాము. మహారాష్ట్ర ప్రజలు అనవసరంగా సృష్టించిన సరిహద్దు వివాదాలను ఖండిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది" అని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ బొమ్మై గత వారం ప్రవేశపెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో శాంతిని కాపాడేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని కర్ణాటక ముఖ్యమంత్రి ఇంతకు ముందు చెప్పారు. కానీ, ఇప్పుడు ఈ అంశం ఇరు రాష్ట్రాలు, బీజేపీ నాయకుల మధ్య మరో తీవ్ర రచ్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.